బొంరాస్పేట, సెప్టెంబర్ 14 : బీఆర్ఎస్ పాలనలో తండాల ముఖచిత్రం మారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన గిరిజన తండాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నాయి. గతంలో కనీస సౌకర్యాలైన తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి అభివృద్ధి పనులకు నోచుకోని తండాలు నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా స్వయం పాలనతో పాటు గ్రామాలు సమానంగా అభివృద్ధిని సాధిస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తరువాత 500 జనాభా ఉన్న గిరిజన తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ 2018లో ఇచ్చిన మాట ప్రకారం తండాలు పంచాయతీలుగా ప్రకటించి పాలన, అభివృద్ధిని ప్రజల ముంగిటకు చేర్చారు. నేడు గ్రామాల్లో మాదిరిగానే గిరిజన తండాలకు బీటీ రోడ్లు, విద్యుత్ సౌకర్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాలు, కంపోస్ట్ షెడ్లు, ట్రాక్టర్ వంటి అనేక పనులు సమకూరుతున్నాయి. గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఎస్టీ ఎస్డీఎఫ్ పథకం కింద వికారాబాద్ జిల్లాకు రెండు విడుతల్లో 80 బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.97.99కోట్లను మంజూరు చేసింది. మంజూరైన బీటీ రోడ్లను త్వరగా పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేయడం పట్ల తండాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన బీటీ రోడ్లు పూర్తయితే మారుమూల గిరిజన తండాలకు రవాణా సౌకర్యం మరింత మెరుగవనున్నది.
వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు మొదటి విడుతలో 49 బీటీ రోడ్లకు రూ.64.24 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో కొడంగల్ నియోజకవర్గంలో 19 రోడ్లకు రూ.32.13 కోట్లు, వికారాబాద్ నియోజకవర్గంలో 4 రోడ్లకు రూ.5.56 కోట్లు, తాండూరులో 7 రోడ్లకు రూ.5.56 కోట్లు, పరిగిలో 19 రోడ్లకు రూ.20.99 కోట్లు మంజూరయ్యాయి. రెండో విడుతలో మూడు నియోజకవర్గాలకు 31 రోడ్లకు రూ.33.75 కోట్లు మంజూరయ్యాయి. పరిగిలో 12 రోడ్లకు రూ.1.85 కోట్లు, వికారాబాద్లో 5 రోడ్లకు రూ.10.06 కోట్లు, కొడంగల్లో 14 రోడ్లకు రూ.21.84 కోట్లు మంజూరయ్యాయి.
బీటీ రోడ్ల మంజూరులో కొడంగల్ నియోజకవర్గానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఐటీ మంత్రి కేటీఆర్ దత్తత తీసుకోవడం, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించడానికి చేస్తున్న కృషి కారణంగా కొడంగల్ నియోజకవర్గానికి ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరవుతున్నాయి. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్పేట మండలం, నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలంలో ఎక్కువగా గిరిజన తండాలు ఉన్నాయి. ఇంతకు ముందు ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్రెడ్డి తండాల అభివృద్ధిని పెద్దగా పట్టించుకోలేదు. 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత పట్నం నరేందర్రెడ్డి గ్రామాలతో పాటు తండాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించి నిధులు మంజూరు చేయిస్తున్నారు. జిల్లా మొత్తం మీద తండాల్లో 80 బీటీ రోడ్లకు రూ.97.99 కోట్లు మంజూరైతే కొడంగల్ నియోజకవర్గానికే 33 రోడ్లకు రూ.53.97 కోట్లు మంజూరయ్యాయి.
గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. తండా ప్రజల గోడును బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకుని అభివృద్ధి చేస్తున్నది. మదన్పల్లితండా నుంచి ఇబ్రహీంపూర్తండా, అక్కడి నుంచి పరిగికి వెళ్లడానికి రోడ్డు వేయాలని గతంలో ఎందరో ప్రజా ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోలేదు. మా సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన వెంటనే బీటీ రోడ్డు మంజూరు చేయించారు.
– సురేశ్, మదన్పల్లితండా, బొంరాస్పేట మండలం
బీఆర్ఎస్తోనే తండాలకు గుర్తింపు బీఆర్ఎస్తోనే గిరిజన తండాలకు గుర్తింపు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తండాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. అభివృద్ధికి నోచుకోలేదు. సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా చేసిన తరువాత ప్రతి తండాకూ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, విద్యుత్ వంటివి అనేక సౌకర్యాలు గిరిజనులకు అందుతున్నాయి. పట్నం నరేందర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తండాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
– దేశ్యానాయక్, సేవాలాల్ మహారాజ్ కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడు