న్యూఢిల్లీ : జాతీయ రహదారులపై ప్రమాదాల సమయంలో అత్యవసర స్పందనలో జరిగే ఆలస్యాన్ని నివారించేందుకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) 10 నిమిషాల డెడ్లైన్ను తీసుకొచ్చింది. 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రమాదస్థలికి 10 నిమిషాల్లోపు అంబులెన్స్ చేరుకోవాలని బుధవారం విడుదల చేసిన తన విధాన మార్గ దర్శకాల్లో పేర్కొంది. ఇలా చేరుకోని పక్షంలో ప్రతి ఘటనలో రూ.10 వేలు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రమాదాల్లో సహాయ టికెట్ అభ్యర్థనను ఆమోదించినప్పటి నుంచి గంట లోపు దగ్గరలోని దవాఖానకు బాధితులను చేర్చాలని సూచించింది. దీన్ని ఉల్లంఘించిన వారికి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశముందని చెప్పింది.
10 కిలోమీటర్ల పరిధి దాటిన ప్రమాదాల్లో అంబులెన్స్ చేరుకోవాల్సిన సమయం దామషా ప్రకారం పెరుగుతుందని.. ఇది జీపీఎస్ డేటా/ఐఎమ్ఎస్ కేర్ డ్యాష్ బోర్డ్ ద్వారా ధ్రువీకరణ అవుతుందని స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ టికెట్ను తిరస్కరిస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తామని వెల్లడించింది. ఒప్పందాల్లో భాగంగా పరికరాలు, మందులు, సిబ్బందిని సమకూర్చని సంస్థలకు రూ.10 వేల జరిమానా వేస్తామని తెలియజేసింది. తాజా మార్గదర్శకాలను ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ప్రాంతీయ అధికారులు కట్టదిట్టంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే జాతీయ రహదారులపై వివిధ సేవల కోసం 1033 హెల్ప్లైన్ నెంబర్ను ఎన్హెచ్ఏఐ నిర్వహిస్తున్నది.