శంఖచక్రధరం దేవం
లోకనాథం దయానిధిం
అశేష దుఃఖ శాంత్యర్థం
లక్ష్మీ నారాయణం భజే
అంటూ శ్రీ లక్ష్మీ నారాయణుల స్తుతులు, భజనలు, ఆలాపనలతో ముచ్చింతల్ శ్రీ చినజీయర్ ఆశ్రమం హోరెత్తుతున్నది. ఓ వైపు యాగం, మరో వైపు నిర్విరామంగా కొనసాగుతున్న జప, కీర్తన, పారాయణలతో భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వం చెందుతున్నారు. విష్ణు రూపాలను ఆరాధిస్తూ కొనసాగుతున్న భజనలు, నృత్య రూపకాలు, నాటకాలు శ్రోతలను, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సహస్రాబ్దివేడుకల్లో రెండో రోజైన గురువాం నాడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామ పరిధిలోని శ్రీరామనగరంలోని వచన మండపంలో శ్రీ రామానుజాచార్యుల అష్టోత్తర శత నామ పూజను శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం భక్తుల కోసం ప్రవచనం చేశారు.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ)/ మణికొండ/శంషాబాద్ రూరల్
సహస్రాబ్ది పర్వంలో రెండో రోజైన గురువారం నాడు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు దుష్ట నివారణకు శ్రీ సుదర్శన, సర్వాభీష్ట సిద్ధికి వాసుదేవులను స్మరిస్తూ అష్టోత్తర నామాలను జపించారు. ఆ తర్వాత అరణి మథనం క్రతువును త్రిదండి చినజీయర్ స్వామి నేతృత్వంలో వేలాది మంది వేదపండితులు అట్టహాసంగా నిర్వహించారు. శమీ దండం కింద రావి దండాన్ని ఉంచి రెండింటినీ రాపాడించి అగ్నిని రగిలించడాన్నే అరణి మథనం లేదా అగ్ని మథనం అంటారు. ఈ అరణితో 114 యాగశాలల్లోని 1035 హవన కుండలాల్లోకి అగ్నిదేవుడిని ఆహ్వానించి ప్రతిష్ఠించి శ్రీ లక్ష్మీ నారాయణ మహా యాగాన్ని ప్రారంభించారు. అహోబిల రామానుజ జీయర్, దేవనాథ రామానుజ జీయర్, రామచంద్ర రామానుజ జీయర్, అష్టాక్షరీ రామానుజ జీయర్, వ్రతధర రామానుజు జీయర్ స్వాములు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవోపేతంగా అగ్ని హోత్రాన్ని అన్ని యాగశాలలకు పంపించారు. ఈ క్రతువులో 5 వేల మంది రుత్వికులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. హోమగుండాల వద్ద హవన కార్యక్రమం చేపట్టిన తర్వాత మూలభద్రాది హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. దివ్యదేశాల ప్రతిష్ఠాపనలు ప్రారంభమయ్యాయి.
సాంస్కృతిక కళా విభాగం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆశ్రమానికి తరలివస్తున్న భక్త జన కోటిని అలరిస్తున్నాయి. ప్రముఖ గాయని సురేఖ ఆలపించిన భక్తి సంకీర్తనలు, శ్రీ పద రమాదేవి బృందం ఆధ్వర్యంలో జరిగిన నృత్య గీతికలు అక్కడికి విచ్చేసిన వారిని మంత్రముగ్ధులను చేశాయి. సాయంత్రం యాదాద్రి వెంకన్న బృందం నిర్వహించిన భజన, ప్రముఖ నృత్యకళాకారిణి ప్రణవి బృందం, కిలాంబి శ్రీదేవి,తారక రామారావు, మాధవ పెద్ది చెన్ని బృందాలతో భజన పాటలు, ఆటలతో క్షేత్రమంతా భక్తి పారవశ్యంతో నిండిపోయింది. శ్రీ రామానుజ చరిత్రను వివరిస్తూ జిమ్స్ వైద్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నాటకం అందరినీ ఆకట్టుకున్నది.
ఆశ్రమానికి తరలివస్తున్న భక్తులకు టీకా వేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. శేరిలింగంపల్లి జోన్ నుంచి ఓ మొబైల్ టీకా వాహనాన్ని ప్రత్యేకంగా పంపారు. సహస్రాబ్ది వేడుకలు ముగిసే వరకు ఈ టీకా బృందం అక్కడే సేవలను అందించనుంది. చందానగర్ సర్కిల్ వైద్యాధికారి డాక్టర్ కార్తిక్, శేరిలింగంపల్లి పీహెచ్సీ స్వామి, ఇతర సిబ్బందితో కలిసి జోన్ సంయుక్త కమిషనర్ మల్లారెడ్డి గురువారం జెండా ఊపి ఈ వాహనాన్ని పంపారు.
ప్రవచన మండపంలో పెద్ద జీయర్ స్వామివారి పూజా కార్యక్రమాన్ని త్రిదండి చిన్నజీయర్ స్వామి స్వయంగా ఆచరించి మంగళనీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2వేల మంది భక్తులు స్వామి పెద్దజీయర్ స్వామిని పూజించారు. అనంతరం పెద్దజీయర్ స్వామి అష్టోత్తర శతనామావళిని భక్తులు పటించారు. ఈ సందర్భంగా చిన్న జీయర్స్వామి వారి విశేషాలను, ఔన్నత్యాన్ని మహోపాధ్యాయ సముద్రాల రంగరామానుజులు వివరించారు.
సహస్రాబ్ది క్రతువు నిర్విఘ్నంగా నిరంతరాయంగా సాగిపోయేలా పెద్ద ఎత్తున ప్రభుత్వ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు ఈ సేవలో పాలు పంచుకుంటున్నారు. ఎవరెవరు పాల్గొంటున్నారంటే..
14వేల మంది స్వచ్ఛంద సేవకులు
7వేల మంది పోలీసు బలగాలు
5వేల మంది రుత్విక,వేద పండితులు
1500మంది నృత్యకళాకారులు
1100 మంది భజన బృందాలు
74 ఎన్ఐజీ బృందాలు వీక్షిస్తూ ముందుకు సాగండి
యాగశాల, సమతామూర్తి ప్రాంగణానికి వేలాదిమంది భక్తజన సందోహం తరలివస్తుండటంతో యాగాశాల ముందున్న పాకలో సగ భాగం తొలగించేందుకు నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు. రోజురోజుకు రద్దీ పెరిగిపోతుండడంతో మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. యాగ క్రతువును భక్తులు వీక్షించి ముందుకు వెళ్లాలి తప్ప నిరంతరం ఇక్కడే కూర్చోవడం కుదరదని భక్తులకు శ్రీ చినజీయర్స్వామి సూచించారు. భక్త జనులు ఈ విషయంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
9:30 నుంచి 10:30 వరకుశ్రీ లక్ష్మీనారాయణ పూజ
10:30 నుంచి 10:50లకు యాగశాలల్లో శ్రీ చిన జీయర్ స్వామి పర్యటన
10:50 నుంచి 11:10 వకు అథర్వ వేదపండితుల ఆశీర్వచనాలు
11:10నుంచి 11:30 వరకు ప్రజ్ఞ,మనోజ్ఞ, సప్తస్వర సంగీత అకాడమీ వారి సంగీత గానం
11:30 నుంచి 12:00 వరకు అతిథులకు సన్మానం
12:00 నుంచి 12:30 వరకు శ్రీమతి పేరిందేవి-శ్రీకృష్ణన్మత్వ అకాడమీ-బృంద నృత్య ప్రదర్శనలు
12:30 నుంచి 1:00 వరకు సుష్మ, సుస్మిత బృంద గానం
2:00 నుంచి 2:30 వరకు పెద్దబ్రోలు భావన బృందం నృత్య ప్రదర్శనలు
2:30 నుంచి 2:50 వరకు యజుర్వేద పండితుల పుణ్యవచనాలు
2:50 నుంచి 3:10 వరకు నల్లగొండకు చెందిన మానస భజన బృంద ఆలాపనలు
3:10 నుంచి 3:30 వరకు రఘునాథ భట్టర్ ప్రవచనాలు
3:30 నుంచి 3:50 వరకు పెద్దబ్రోలు భావన బృందం నృత్య ప్రదర్శనలు
3:50 నుంచి 4:10 వరకు వేద పండితుల ప్రవచన పఠనాలు
4:10 నుంచి 5:00 వరకు వెంకన్న స్వామి భజన
5:00 నుంచి 5:30 వరకు విష్ణు సహస్ర నామ పారాయణం
5:30 నుంచి 5:45 వరకు దేవనాథ రామానుజ జీయర్ స్వామి ప్రచవనాలు
5:45 నుంచి 6:00 వరకు వేద పఠనం, ప్రవచనం
6:00 నుంచి 7:00 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు
7:00 నుంచి 7:30 వరకు అతిథులకు సన్మానాలు, ఆశీర్వచనాలు
7:30 నుంచి 8:00 వరకు మ్యాపింగ్ వీడియో ప్రదర్శనలు
8నుంచి 10 వరకు శ్రీమన్నారాయణుడి భజనలు
ఉత్సవాల్లో భాగంగా యాగశాల విశిష్టతను త్రిదండి చినజీయర్ స్వామి వేదపండితులు, రామానుజ భక్తులకు వివరించారు. యాగశాలను మొత్తంగా నాలుగు భాగాలుగా విభజించినట్లు వివరించారు. యాగశాలలో ఏర్పాటు చేసిన బోగమండపం శ్రీరంగానికి ప్రతీక అని, పుష్పమండపం తిరుమల క్షేత్రానికి, త్యాగమండపం కాంచీపురం క్షేత్రానికి, జ్ఞాన మండపం మేలుకోట క్షేత్రానికి ప్రతీకలని అభివర్ణించారు. ఆయా పుణ్యక్షేత్రాలతో రామానుజాచార్యుల జీవితానికి అద్భుతమైన అనుబంధముందని తెలిపారు. ఈ నాలుగు దిక్కులా 144 యాగశాలలున్నాయి. ఒక్కో యాగశాలలో 9 కుండలాలను ఏర్పాటు చేశారు. ఒక్కో యాగ కుండలికి ఒక్కో ఆగమ విద్వాంసుడిని నిర్వాహకులుగా నియమించారు.
ఆశ్రమంలో తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రపై టీటీడీ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. తిరుమల తీర్థాలు, వైద్యశాలలు, అలిపిరి, పాత, కొత్త ఛాయాచిత్రాల సమాహారం చూపరులకు ఆసక్తి గొలుపుతున్నాయి చిన్నజీయర్ స్వామి ఆశ్రమ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆధ్యాత్మిక పుస్తక ప్రదర్శన, ఆయుర్వేద ఉత్పత్తులు, పురాతన దేవాలయాల చరిత్ర, పలు దృశ్యమాలికలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
దివ్య సాకేతానికి విచ్చేస్తున్న భక్తుల కోసం రాష్ట్ర వైద్య శాఖ ఏర్పాట్లు చేసింది. వేడుకల చివరి రోజు వరకు రంగారెడ్డి జిల్లా వైద్య శాఖ-యశోద దవాఖాన సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. రోజూ 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో సేవలను అందించనున్నారు. గుండె, శ్వాస, కంటి విభాగాల వైద్య నిపుణులతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. అత్యవసర చికిత్సల కోసం ఇతర దవాఖానలకు తరలించేందుకు 5 అంబులెన్సులు, ఈసీజీ వంటి పరీక్షలు, 108 బృందం కూడా సిద్ధంగా ఉంటాయి.