కొడంగల్, ఏప్రిల్ 6 : కొడంగల్ శ్రీమహాలక్ష్మీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పదిరోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగాయి. పది రోజులు శ్రీనివాసుడు విశిష్టమైన 18 వాహనాలపై శోభాయమానంగా అలంకరింపబడి భక్తులకు దర్శనభాగ్యం కలిగించాడు. బుధవారం చక్రస్నానం, ధ్వజ అవరోహణంతో ముగింపు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీనివాసుడికి ఉదయం బ్రాహ్మణుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఘనంగా అభిషేకం నిర్వహించారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన అభిషేక కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు కిక్కిరిసిపోయారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ప్రాంగణంలోని గుండంలో చక్రస్నానం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నీటిలో మునిగితే సకల పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మిక. ఈ సందర్భంగా గుండంలో స్నానమాచరించారు. అనంతరం స్వామిని ప్రత్యేకంగా అలంకరించి మహామంగళ హారతులు, నైవేద్యాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల తొలి రోజు ఆవిష్కరించిన గరుడ ధ్వజాన్ని రాత్రి అవరోహణ కార్యక్రమాన్ని చేపట్టి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు.