వికారాబాద్, డిసెంబర్ 12 : గత రెండున్నర నెలలు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నం దున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించలేకపోయామని, ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీవోలు, ఏపీవోలు, ఏపీఎంలతో నర్సరీల నిర్వహణ, పారిశుధ్యం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని, పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. నేటి నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, రోడ్ల పైన, రోడ్లకు ఇరువైపులా చెత్తాచెదారం తొలగించాలని ఆదేశించారు. అన్ని మండలాలలో ఎంపీడీవో లు, ఎంపీవోలు, మున్సిపల్ వార్డులలో మున్సిపల్ కమిషనర్లు పారిశుధ్య పనులను పర్యవేక్షించాలన్నారు. అన్ని ఆవాసాలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తాగు నీటిని సరఫరా చేయాలని, వీధి దీపాలు వెలిగే విధంగా పూర్తి బాధ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.
హరితహారంలో భాగంగా నిర్వహిస్తున్న నర్సరీలన్నీ బాగుండాలని, అన్ని నర్సరీల్లో కేటాయించిన లక్ష్యానికి మూడింతలు ఎక్కువ మొత్తంలో మొక్కలు పెంచాలని తెలిపారు. హరితహారంలో ఉపయోగపడే మొక్కలను పద్ధతి ప్రకారంగా పెంచాలని సూచించారు. వర్షాకాలంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించేందుకు, పిచ్చి మొక్కలను తొలగించి సాసరింగ్ చేసి నీరు పోయాలని గుర్తు చేశారు. ఉపాధి హామీ కూలీలతో గడ్డి, పిచ్చి మొక్కలను 15 రోజులలో తొలగించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల సంఖ్య ను పెంచాలని సూచించారు. వీధి వ్యాపారులకు లక్ష్యం మేరకు రుణాలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని మెప్మా అధికారిని ఆదేశించారు. ఆఫీసు సమయంలో నిర్ల క్ష్యం వహించకుండా పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి అటెండెన్స్ యాప్ ను పక్కాగా అమలు చేయాలన్నారు.
జిల్లా అధికారులందరూ ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, క్రింది స్థాయి సిబ్బందితో కూడా పనులు చేయించుకోవాలని సూచించారు. ప్రతిరోజూ ఎంతమంది సిబ్బంది విధులకు హాజరవుతున్నారు, ఎంతమంది గైర్హాజర్ అయినారో అటెండెన్స్ యాప్ ద్వారా సమీక్షిస్తానని కలెక్టర్ తెలిపారు. కాగా జిల్లాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నాలుగు నియోజకవర్గాలలో శాసనసభ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన అధికారులందరిని కలెక్టర్ అభినందించారు. రాబోయే గ్రామ పంచాయతీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తి తో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విధులను నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీఆర్డీవో కృష్ణన్, డిప్యూటీ సీఈవో సుభాషిణి, డీపీవో తరుణ్ కుమార్, మెప్మా పీడీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
రెవెన్యూ శాఖలో వీఆర్ఏలుగా విధులు నిర్వహించి ఇతర శాఖలకు ప్రమోషన్ పొందిన తాము నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం కలెక్టర్ నారాయణ రెడ్డికి వీఆర్ఏలుగా పని చేసి ప్రమోషన్ పొందిన ఉద్యోగులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టి.సరోజ, అంజిలప్ప, శ్రీను, లవ కుమార్, నర్సమ్మ, శిరీష, సరిత, అంజి, కృష్ణ తదితరులు ఉన్నారు