వికారాబాద్, జనవరి 6 : వికారాబాద్ జిల్లా కోర్టుకు స్థలం, భవన సముదాయానికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి సభాపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు సన్మానించిన అనంతరం సభాపతి మాట్లాడుతూ తన దృష్టికొచ్చిన కోర్టుకు సంబంధించిన భూ సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు.
బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు జిల్లా కోర్టు సముదాయానికి పది ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు స్థల పరిశీలన చేపడతామన్నారు. జిల్లాలోని రోడ్ల నిర్మాణాలకు రూ.400 కోట్లు కేటాయించామన్నారు. గతంలోనే పర్యాటక అభివృద్ధికి రూ.225 కోట్ల నిధులు మంజూరు చేశామని, రూ.25 కోట్లతోనే పనులు చేపట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజులారమేశ్, తెలంగాణ బార్ అసోసియేషన్ కౌన్సిల్ మెంబర్ అనంతసేన్ రెడ్డి, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు బస్వరాజ్, గోవర్ధన్ రెడ్డి, యాదవ రెడ్డి, సంపూర్ణ ఆనంద్, మాధవరెడ్డి, మహ్మద్ రఫీ, ఇతర న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యార్థులు బాగా చదువుకొని దేశానికి మంచి పేరు తేవాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం వికారాబాద్ యజ్ఞ ఫౌండేషన్ వివేకానంద గురుకుల పాఠశాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలో భాగంగా 7వ నేషనల్ యూత్ డే కార్యక్రమాన్ని వికారాబాద్లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి స్పీకర్, చంద్రయాన్-3 అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ వికారాబాద్లో 7వ నేషనల్ యూత్ డే స్పేస్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించడం సంతోషంగా ఉన్నదన్నారు.
విద్యార్థులు బాగా చదివి శాస్త్రవేత్తలుగా మారి భారతదేశపు ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలని సూచించారు. చంద్రయాన్-3 అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కల్పన మాట్లాడుతూ.. దేశంలో సైన్స్ దినదినాభివృద్ధి సాధిస్తున్నదని, ప్రపంచ దేశాలు వెళ్లలేని సౌత్ పోల్పై చంద్రయాన్-3ని ల్యాండ్ చేశామన్నారు. యూత్ డేకు 20 పాఠశాలలు, 200 మంది ఉపాధ్యాయులు, దాదాపు 1300 మంది విద్యార్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, కౌన్సిలర్ సుధాకర్రెడ్డి, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, యజ్ఞ ఫౌండేషన్ సభ్యుడు ఉజ్వల్రాజ్ పాల్గొన్నారు.
అయ్యప్పస్వామి భక్తుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరుతూ, వికారాబాద్ పట్టణంలోని ఓ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్కుమార్ను శనివారం అయ్యప్పస్వామి సేవా సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను విన్నవించి వినతిపత్రాన్ని అందజేశారు. కేరళ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో కొన్ని వారాలుగా భక్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతున్నదన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు గంటల తరబడి క్యూలో వేచివుండాల్సిన పరిస్థితి ఉంటున్నదని విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో స్వాములకు భోజనాలు నీటి వసతులు కల్పించేలా చూడాలన్నారు. పోలీస్ సిబ్బందిని పెంచి మన తెలంగాణ నుంచి కూడా పోలీసులను పంపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.