తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తూ ప్రజల మెప్పు పొందుతున్నది. కొన్ని పల్లెల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్కు అంతరాయం ఏర్పడుతున్న కారణంగా సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసేలా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నది. ప్లాంట్ల ఏర్పాటుకు 40 శాతం సబ్సిడీ ఇవ్వడంతో పాటు స్త్రీనిధి ద్వారా రుణ సాయాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నది. సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో 2 కేవీ యూనిట్కు రూ.1,42,200 వ్యయం అవుతుండగా, రూ.39,200 రాయితీ, స్త్రీనిధి ద్వారా రూ.లక్ష రుణ సాయం పోగా, లబ్ధిదారులు రూ.3 వేలు చెల్లిస్తే సరిపోతుంది. 3 కిలోవాట్ల యూనిట్కు రూ.1,92,360 వ్యయం అవుతుండగా, రూ.57,360 రాయితీ, స్త్రీనిధి ద్వారా రూ.1.25 లక్షల రుణ సాయం పోగా, లబ్ధిదారులు రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వికారాబాద్ జిల్లాలోని ఐదు మండలాల్లో 175 సౌర యూనిట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ నెలాఖరులోపు అర్హులను గుర్తించడానికి స్త్రీనిధి సిబ్బంది కసరత్తు చేస్తున్నారు. ఇందుకుగాను మహిళా సంఘాలకు అవగాహన సైతం కల్పిస్తున్నారు.
బొంరాస్పేట, ఫిబ్రవరి 19 : విద్యుత్ కొరతను అధిగమించేందుకు సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని పల్లెల్లో సౌర విద్యుత్తో వెలుగులు నింపాలని భావిస్తున్నది. సెర్ప్ సాయంతో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు సౌరశక్తి విద్యుత్ ఉత్పాదన యూనిట్లు 40 శాతం సబ్సిడీపై అందిస్తూ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన రుణ సాయం చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలకు లక్ష్యాలను నిర్దేశిస్తూ అర్హులైన మహిళలను గుర్తించాలని ప్రభుత్వం గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ జిల్లాకు 175 సౌర యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ నెలాఖరులోపు అర్హులను గుర్తించడానికి స్త్రీనిధి సిబ్బంది కసరత్తు చేస్తున్నారు.
మహిళా సంఘాలకు చేయూత
మహిళా సంఘాలకు 40 శాతం రాయితీతో పాటు రుణ సహాయం చేసి యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా చేయూత అందిస్తున్నది. వికారాబాద్ జిల్లాకు 175 సౌర యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. గత నెలలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను, రాయితీ, రుణ సదుపాయంపై గ్రామాల్లోని మహిళలకు స్త్రీనిధి సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులను గుర్తించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఈ పథకం అమలుకు బొంరాస్పేట, ధారూరు, నవాబుపేట, మర్పల్లి, బంట్వారం మండలాలను అధికారులు ఎంపిక చేశారు. ఒక్కో మండలంలో 35 సౌర యూనిట్ల చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐదు మండలాల్లో ఇప్పటి వరకు 22 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, వీరిలో ముగ్గురిని అర్హులుగా అధికారులు గుర్తించారు. ఈ నెలాఖరులోపు లక్ష్యం చేరుకునేలా కృషి చేస్తున్నారు.
రెండు రకాల యూనిట్లు
సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో 2 కేవీ, 3 కేవీ రెండు రకాల యూనిట్లు ఉన్నాయి. వీటిలో లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ల మేరకు వారికి స్త్రీనిధి సంస్థ రుణ సహాయం చేస్తుంది. 2 కిలోవాట్ల యూనిట్కు రూ.1,42,200 కాగా, రూ.39,200 రాయితీ వస్తుంది. రూ.లక్ష స్త్రీనిధి ద్వారా రుణం అందిస్తుండగా, లబ్ధిదారు రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 3 కిలోవాట్ల యూనిట్కు రూ.1,92,360 కాగా రూ.57,360 రాయితీ లభిస్తుంది. స్త్రీనిధి రూ.1.25లక్షల రుణం ఇస్తుంది. మిగతా రూ.10 వేలు లబ్ధిదారులు చెల్లించాలి. 2 కిలోవాట్ల ప్లాంటు ద్వారా రోజుకు 8 యూనిట్లు, 3 కిలోవాట్ల ప్లాంటు ద్వారా రోజుకు 12 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులు రోజుకు 5 నుంచి 6 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగిస్తుంటారు. ఈ లెక్కన నెలకు 150 నుంచి 180 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగిస్తే మిగిలిన విద్యుత్ గ్రిడ్కు వెళ్తుంది. దీంతో సోలార్ ప్లాంటు నుంచి ఉత్పత్తి అయిన కరెంట్ను వినియోగదారుడు వినియోగించగా మిగిలిన విద్యుత్కు వినియోగదారుడికి డబ్బులు వస్తాయి. సోలార్ ప్లేట్లకు 25 ఏండ్ల వరకు వారంటీ ఇస్తున్నారు. తీసుకున్న రుణం ఐదేండ్లలో చెల్లిస్తే లబ్ధిదారుడికి ఉచితంగా విద్యుత్ అందడంతో పాటు యూనిట్ మిగులుతుంది. మిగులు విద్యుత్ను అమ్ముకోవడం ద్వారా ఆదాయం వస్తుంది.
గ్రామాల్లో లబ్ధిదారులను గుర్తిస్తున్నాం
సోలార్ యూనిట్ల ఏర్పాటుకు గ్రామాల్లో అవగాహన కల్పించి లబ్ధిదారులను గుర్తిస్తున్నాం. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా లాభం పొందుతారు. జిల్లాలో ఐదు మండలాలను ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. ఇప్పటి వరకు 22 మంది మహిళల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి.
– తుమ్మల వేణు, స్త్రీనిధి రీజినల్ మేనేజర్
నెట్ మీటర్ యాప్లో..
సోలార్ ప్లాంటు చేసుకున్న లబ్ధిదారు రోజూ ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది, ఎంత వినియోగమవుతున్నది, ఎంత విద్యుత్ గ్రిడ్కు వెళ్తున్నది తదితర సమాచారం స్మార్ట్ ఫోన్లో నెట్ మీటర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు. ఏమైనా రిపేరు వచ్చినా కంపెనీ వాళ్లు వచ్చి చేస్తారు. రూ.లక్ష రుణం తీసుకున్న వారు నెలకు రూ.2,300, రూ.1.25 లక్షల రుణం తీసుకున్న వారు నెలకు రూ.2,800 చొప్పున 60 నెలల్లో స్త్రీనిధి సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. సోలార్ ప్లాంటు చేసుకోవాలంటే వారి ఇంట్లో నెలకు వేయి రూపాయలకు మించకుండా కరెంటు బిల్లు చెల్లించినవారై ఉండాలి లేదా 2 కిలో వాట్ల విద్యుత్ వాడకం ఉండాలి. అలాంటి వారినే ఎంపిక చేస్తారు. కేవలం గృహ అవసరాలకు మాత్రమే సోలార్ ప్లాంట్లు మంజూరు చేస్తారు. టీఎస్ రెడ్కో వీటిని ఏర్పాటు చేస్తుంది.