రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామపంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.19.99కోట్లు(61.75 శాతం) ఇంటి పన్ను వసూలు కాగా, రాష్ట్రంలోనే జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. ఇంకా రూ.12,38,94,269 బకాయిలు రావాల్సి ఉన్నది. ఈ ఏడాది రూ.32.38కోట్ల ఇంటి పన్నులను వసూలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. వచ్చే ఏడాది మార్చిలోగా అనుకున్న లక్ష్యాన్ని చేరేలా అధికారులు కృషి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పన్నుల వసూళ్లు నిలిచిపోగా, మళ్లీ వసూలు చేసేందుకు అధికారులు దృష్టి సారించారు. గ్రామపంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఇంటి పన్ను ఆదాయం మరింత ఊతమిస్తుందని ప్రజలకు అవగాహన కల్పిస్తుండడంతో పన్నులు చెల్లించేందుకు జనం ముందుకొస్తున్నారు.
రంగారెడ్డి, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. వచ్చే ఏడాది మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో అధికారులు లక్ష్యాన్ని చేరే దిశగా కృషిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 558 గ్రామ పంచాయతీలుండగా 2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.32.38 కోట్ల ఇంటి పన్ను పంచాయతీలకు సమకూరాల్సి ఉన్నది.
ఆరంభంలో ఇంటి పన్ను ప్రక్రియ వేగవంతంగా సాగినప్పటికీ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పన్ను వసూలుకు బ్రేక్ పడింది. ఎలక్షన్లు ముగియడంతో అధికారులు మళ్లీ పన్ను వసూలుపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇప్పటివరకు రూ.19.99కోట్లు(61.75 శాతం) ఇంటి పన్ను వసూలు అయి రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. పన్నుల చెల్లింపులపై అధికారులు కల్పిస్తున్న అవగాహనతో ప్రజలు చైతన్యవంతులై పన్నుల చెల్లింపునకు ముందుకు వస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల పరిధిలో 558 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 2,86,420 గృహ యజమానుల నుంచి ఇంటి పన్నును వసూలు చేయాల్సి ఉన్నది. ఈ ఏడాది రూ.32,38,83,926 ఇంటి పన్ను వసూలును ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నది. డిసెంబర్ 10 నాటికి రూ.19,99,89,657 పన్ను వసూలైంది. ఇంకా రూ.12,38,94,269ల బకాయిలు రావాల్సి ఉన్నది. మూడు నెలలకు పైగా గడువు ఉండడంతో పంచాయతీ పాలకవర్గాలు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి.
ప్రభుత్వం చేపడుతున్న పన్ను వసూలుకు పల్లెవాసులు సైతం మద్దతుగా నిలుస్తున్నారు. గ్రామాభివృద్ధిలో ఇంటి పన్ను కీలకపాత్ర పోషిస్తుండగా.. పన్నులు చెల్లించడం ద్వారా పంచాయతీల అభివృద్ధిలో తమవంతు పాత్రను పోషిస్తున్నారు. గతంలో గ్రామాల్లో పారిశుధ్యం, మంచినీటి సరఫరా వంటివి అధ్వానంగా ఉండడంతో పన్నులు చెల్లించేందుకు యజమానులు ముందుకు రాకపోయేవారు. కానీ.. గత పదేండ్లలో పల్లెల్లో వచ్చిన గణనీయమైన మార్పుతో ఇంటి పన్ను చెల్లించేందుకు చొరవ చూపిస్తున్నారు. పంచాయతీల ఖజానాలో సరిపడా నిధులు ఉన్నప్పుడే కావాల్సిన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్న విషయాన్ని ప్రజానీకం గుర్తెరిగి అందుకనుగుణంగా వ్యవహరిస్తున్నది. మరోపక్క పన్ను చెల్లింపులపై అధికారులు అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. దీంతో ఒకప్పటిలా గాకుండా గ్రామాల్లో పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్నది.
– శ్రీనివాస్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి
ఈ ఏడాది లక్ష్యంలో పన్ను వసూలు సగం శాతం దాటింది. పన్నులను రాబట్టడంలో సంబంధిత అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషించడం వల్లనే ఇది సాధ్యపడింది. పన్ను వసూళ్లలో ఏ పంచాయతీ వెనుకబడి పోయిందో గుర్తించి ముందుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తి లక్ష్యాన్ని చేరుకునేలా పటిష్ట కార్యాచరణను అమలుచేస్తున్నాం.