వికారాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : సాగు సంబురంగా సాగుతున్నది. ఈ వానకాలం వర్షాలు సమృద్ధిగా కురువడంతో చెరువులు, కుంటలు నిండడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. దీనికితోడు రాష్ట్ర సర్కార్ అందించిన పెట్టుబడి సాయం, సరిపడా ఎరువులు, విత్తనాలను వికారాబాద్ జిల్లాయంత్రాంగం అందుబాటులో ఉంచడంతో ఎలాంటి రందీ లేకుండా రైతన్నలు సాగు పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దాదాపుగా 4.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. అంచనాకు మించి అధికంగా 2.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, లక్ష ఎకరాల్లో కంది పంట సాగైంది. 43,659 ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేయగా, ఇప్పటి వరకు 15,425 ఎకరాల్లో వరి పంటను సాగు చేయగా, ఈ నెల రెండో వారం వరకు నాట్లు వేసుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ఆయా పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
జిల్లాలో వానకాలం పంటల సాగు 4.50 లక్షల ఎకరాలకు చేరింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 4,47,103 ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జిల్లా రైతాంగం పత్తి పంట సాగువైపే మొగ్గు చూపుతుండడం గమనార్హం. ఇప్పటివరకు సాగైన ఆయా పంటల్లో అధిక శాతం మేర పత్తి పంటను రైతులు సాగు చేశారు. ఈ వానకాలం సీజన్లో పత్తితోపాటు కందులు, మొక్కజొన్న పంటలను అధిక మొత్తంలో సాగు చేశారు. మరోవైపు వరి పంటకు సంబంధించి నాట్లు వేసేందుకు ఈ నెల రెండో వారం వరకు సాగు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
వానకాలం సాధారణ సాగు విస్తీర్ణం 5.46 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 81 శాతం మేర పూర్తయింది. విత్తనాలు, ఎరువులకు సంబంధించి జిల్లా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా వ్యవసాయ శాఖ అవసరమైన చర్యలు చేపట్టింది. రైతులు సాగు చేస్తున్న ఆయా పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను జిల్లా వ్యవసాయాధికారులు వేగవంతం చేశారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాల వరకు ఆయా పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ పూర్తయింది.
అందుబాటులో సరిపోను ఎరువులు
జిల్లా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో సరిపోను ఎరువులను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. ప్రతి గ్రామపంచాయతీలో ఏఈవోలు క్షేత్రస్థాయిలో పంటల సర్వే నిర్వహిస్తుండడంతో ఎరువులు, విత్తనాలు ఎంతమేర అవసరమనేది ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ వానకాలం సీజన్కు యూరియా, డీఏపీ, ఎన్పీకెఎస్, ఎంవోసీ, ఎస్ఎస్పీ ఎరువులు అన్ని కలిపి 74,683 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేశారు.
జిల్లావ్యాప్తంగా యూరియా 28,867 మెట్రిక్ టన్నులు, డీఏపీ 15,360 మె.ట, కాంప్లెక్స్ ఎరువులు 21,899 మె.ట, ఎంవోపీ 6206 మె.ట, ఎస్ఎస్పీ 2351 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ప్రతి నెల ఎంతమేర ఎరువులు అవసరమో దాని కంటే అదనంగా 10 శాతం ఎరువులను జిల్లాలోని స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉంచుతున్నారు. పీఏసీఎస్, డీలర్లు, కంపెనీ గోదాంలు, మార్క్ఫెడ్, వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల ద్వారానే ఎరువులను సరఫరా చేస్తున్నారు. ఎరువుల విక్రయ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చారు. స్టాక్ పాయింట్ నుంచి జిల్లాకు ఎంత సరఫరా అయ్యింది, జిల్లాలోని స్టాక్ పాయింట్ ద్వారా ఆయా ఎరువుల దుకాణాలను ఎంతమేర ఎరువులు సరఫరా అయ్యాయనే వివరాలతోపాటు జిల్లాలోని ఎరువుల దుకాణాల నుంచి రైతులు ఎంతమేర కొనుగోలు చేశారనే పూర్తి వివరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అపడేట్ చేస్తున్నారు.
4,47,103 ఎకరాల్లో ఆయా పంటల సాగు
జిల్లాలో ఇప్పటివరకు 4,47,103 ఎకరాల్లో ఆయా పంటలు సాగు కాగా, అధికంగా పత్తి పంటను సాగు చేశారు. వానకాలం సీజన్లో ఆయా పంటలు మొత్తం 5,46,205 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 81.86 శాతం మేర ఆయా పంటలు సాగయ్యాయి. జిల్లాలో 2,06,353 ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేయగా.. అంచనాలకు మించి 2,45,221 ఎకరాల్లో పత్తి పంటను రైతాంగం సాగు చేసింది. పత్తికి మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో పత్తికి డిమాండ్ పెరిగింది. రైతులకు లాభసాటి వ్యవసాయాన్ని అందించాలనే ఉద్దేశంతో పత్తి సాగు పెంచేందుకు వ్యవసా యశాఖ యంత్రాంగం అవగాహన కల్పించింది.
ఈ నెల రెండో వారం వరకు వరి నాట్లు
– జిల్లా వ్యవసాయాధికారి గోపాల్
వానకాలం సీజన్కు సంబంధించి ఆయా పంటల సాగు విస్తృతంగా సాగుతున్నది. వానకాలం సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణానికి మించి పత్తి పంట సాగయింది. వరి నాట్లు వేయడం జోరందుకుంది. ఈ నెల రెండో వారం వరకు వరి నాట్లు వేసేందుకు అనుకూలం. సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాం.