హైదరాబాద్, జూలై 29(నమస్తే తెలంగాణ) : ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు మాత్రమేనని, సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం ఎస్ఐఆర్ ప్రక్రి య పురోగతి, డిజిటలైజేషన్పై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడు తూ.. ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేందుకు ఐదు రోజులు గడువు మాత్రమే ఉన్నందున, ఆగస్టు 3లోగా డిజిటలైజేషన్ ప్రక్రియ 100% పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 76% డిజిటలైజేషన్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 90% వరకు పూర్తయిందని, ఖానాపూర్, బాలొండ, ఎల్లారెడ్డి, హజూర్నగర్, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, బోధ్ నియోజకవర్గాల్లో 100% డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పారు.
పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ వేగం మందగించినట్టు సీఈవో పేర్కొన్నారు. శేరిలింగంపల్లి, రంగారెడ్డి, మేడ్చల్, జీహెచ్ఎంసీ పరిధిలోని అర్బన్ ప్రాంతాలతోపాటు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం పట్టణ ప్రాంతాల్లో డీఈవోలు ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా ప్రక్రియను ముగించాలని స్పష్టంచేశారు. ఎన్యుమరేషన్ ఫారాలను అప్లోడ్ చేసేటప్పుడు పేర్లలో తప్పులు దొర్లకుండా బీఎల్వోలు, సూపర్వైజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఓటర్లలో మరణించిన, ఇల్లు మారిన, అందుబాటులో లేనివారి(ఏఎస్డీ) జాబితా సిద్ధంచేసేటప్పుడు అన్ని రాజకీయ పార్టీల బీఎల్ఏల సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.