సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటిగా మారిన శంషాబాద్ విమానాశ్రయ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం విమానాల రాకపోకల సామర్థ్యం పెంపునకు అనుగుణంగా చేపట్టిన టర్మినల్ విస్తరణలో భాగంగా తూర్పు వైపు 15742 చదరపు మీటర్ల టర్మినల్ అందుబాటులోకి వచ్చింది. భద్రతా తనిఖీల అనంతరం మూడు వారాల్లోనే దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉంది. తాజాగా విస్తరిస్తున్న విమానాశ్రయం టర్మినల్తో కలిసి మొత్తం వైశ్యాలం 3,79,370 చదరపు మీటర్లకు పెరగనుంది. ప్రతి ఏటా సుమారు 3.4కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేలా విస్తరణ పనులు చేపట్టారు. మొదట 1.10 కోట్ల మంది ప్రయాణికులే లక్ష్యంగా నిర్మించిన శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఊహించని రీతిలో వృద్ధి నమోదైంది. దీంతో జీఎంఆర్ ఎయిర్పోర్టు సంస్థ విస్తరణ పనులను చేపట్టింది.
శంషాబాద్ ఎయిర్పోర్టు దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు దేశంలో ఢిల్లీ మొదటి, ముంబాయి రెండో, బెంగళూరు మూడో స్థానంలో ఉండగా, హైదరాబాద్ ఎయిర్పోర్టు 4వ స్థానంలో ఉంది. భూభాగం దృష్ట్యా చూస్తే శంషాబాద్ విమానాశ్రయం ఢిల్లీ కంటే విస్తీర్ణంలో పెద్దది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్పోర్టు కేంద్రంగా విశ్వవిద్యాలయం కార్యకలాపాలను చేపట్టాలని సూచించింది.
విమానశ్రయం విస్తరణతో ఇంటిగ్రేటెడ్ ప్యాసింజర్ టర్మినల్ విస్తీర్ణం 3,79,370 చదరపు మీటర్లకు పెరుగుతుంది. ఇందులో 149 చెక్ ఇన్ కౌంటర్లు, ఏటీఆర్ఎస్తో కూడిన 26 సెక్యూరిటీ స్క్రీనింగ్ యంత్రాలు, 44 ఎమిగ్రేషన్, 44 ఇమిగ్రేషన్ కౌంటర్లు ఉంటాయి. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల కోసం మరిన్ని లాంజ్లు, రిటైల్, ఫుడ్ అండ్ బేవరేజెస్ అవుట్లెట్లను ఏర్పాటు చేశారు. 44 కాంటాక్ట్ గేట్లు, 28 రిమోట్ డిపార్చర్ గేట్లు, 9 రిమోట్ అరవైల్ గేట్లు అందుబాటులోకి వస్తాయి. రన్వే సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి 4 కొత్త రాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సివేలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు విమానంలోకి ఎక్కేందుకు,దిగేందుకు వీలుగా 3 కొత్త ఎయిరోబ్రిడ్జీలను అందుబాటులోకి తెచ్చారు. కాంటాక్ట్లెస్ ప్రయాణం కోసం 6 ఈ-గేట్లు ఉంటాయి. వీటి ద్వారా ప్రయాణికులు భద్రతా తనిఖీ కోసం వెళ్లి,ఆపై తక్కువ సమయంలో విమానం ఎక్కేలా ఏర్పాటు చేశారు. కొత్తగా గ్రౌండ్ సర్వీస్ ఎక్విప్మెంట్ ( జీఎస్ఈ) కోసం సొరంగ మార్గాన్ని నిర్మించారు. జీఎస్ఈ టన్నెల్ విమానాశ్రయానికి తూర్పు వైపున ఉన్న 42 రిమోట్ ఎయిర్ క్రాప్ట్ స్టాండ్లను కలుపుతుంది.
దేశంలోనే అత్యంత కీలకమైన విమానాశ్రయంగా శంషాబాద్ మారుతున్న నేపథ్యంలో పలు ఏవియేషన్ కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారతీయ పరిశ్రమల సమాఖ్య( కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ-సీఐఐ) ఒక విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. ఈ సంస్థ జీఎంఆర్ ఎయిర్పోర్టుతో కలిసి ఏవియేషన్కు సంబంధించిన కోర్సులను నిర్వహించేందుకు విద్యాసంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.