షాద్నగర్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ టైలర్ షాపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన షాద్నగర్ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు, స్థానికుల కథనం ప్రకారం.. షాద్నగర్ పట్టణానికి చెందిన రాంచంద్రయ్య అనే వ్యక్తి కొన్ని రోజులుగా పద్మావతి కాలనీలో వినోద్ టైలర్ పేరుతో షాపును నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎప్పటిలాగే గురువారం రాత్రి షాపు మూసివేసి ఇంటికి వెళ్లారు. అర్థరాత్రి సమయంలో షాపులో నుంచి పోగలు రావడాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిప్రమాదం చోటు చేసుకుందని గ్రహించి ఫైర్ ఇంజన్తో మంటలు అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో షాపులో ఉన్న విలువైన కుట్టు మిషన్లు, విలువైన వస్త్రాలు కాలిపోయాయని బాధితుడు రాంచంద్రయ్య తెలిపారు. సుమారు రూ. 12లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలిపాడు. అగ్ని ప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన రాంచంద్రయ్యను ఆదుకునేందుకు పలువురు ముందుకు వచ్చారు. పట్టణానికి చెందిన పలువురు చిరు వ్యాపారులు, అఖిల భారత యాదవ సంఘం నాయకులు కొంత ఆర్థిక సహాయం అందించారు.