పేదల సొంతింటి కల సాకారం కానున్నది. రంగారెడ్డి జిల్లాలో రూ.2,104.06కోట్ల వ్యయంతో 23,600 ఇండ్ల నిర్మాణాలు సకల సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే 11,004 ఇండ్ల నిర్మాణాలు పూర్తై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. తొలి విడుతలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్, ఎల్బీనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో 500 ఇండ్ల చొప్పున 2వేల ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు జిల్లాయంత్రాంగం రంగం సిద్ధం చేసింది. బుధవారం కొంగరకలాన్లోని రంగారెడ్డి కలెక్టరేట్లో మంత్రి సబితారెడ్డి సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు లేకుండా ‘ర్యాండమైజేషన్’ నమూనాలో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్కార్డును ఆధారంగా చేసుకుని సాఫ్ట్వేర్ను రూపొందించడం వల్ల ఒకసారి లబ్ధిపొందిన వారు మళ్లీ ఎంపికయ్యే అవకాశం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. ఎంపికైన లబ్ధిదారుల పేర్లను చూసుకునేందుకు ప్రత్యేకంగా డిజిటల్ డిస్ప్లేలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నది.
– రంగారెడ్డి, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ)
పేదోడి కలల సౌధం సాకారమవుతున్నది. ఆత్మగౌరవంతో కూడిన ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇచ్చి అగ్గిపెట్టెల్లాంటి ఇండ్లకు చరమగీతం పాడాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల కల రంగారెడ్డి జిల్లాలో నెరవేరబోతున్నది. జిల్లాలో రూ.2,104.06 కోట్ల వ్యయంతో 23,600 ఇండ్లు ఆధునిక హంగులతో.. సకల సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే 11,004 ఇండ్ల నిర్మాణాలు సకల హంగులను సొంతం చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొలి విడుతలో జీహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్, ఎల్బీనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో 500 ఇండ్ల చొప్పున 2వేల ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగనుంది. ‘ర్యాండమైజేషన్’ నమూనాలో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరిపేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
– రంగారెడ్డి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ)
నేడు 2వేల మందికి ఇండ్ల కేటాయింపు
సొంత ఇంటి జాగ కలిగి ఉన్నవారికి ‘గృహలక్ష్మి’ పథకం కింద రూ.3లక్షల సాయం అందించి సొంతింటి కలను సాకారం చేసే దిశగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం మరోపక్క డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేసేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నది. తొలుత జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మహేశ్వరం, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో 500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను కేటాయించనున్నారు. ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి ఈ నాలుగు నియోజకవర్గాల్లో దరఖాస్తులను స్వీకరించగా 93,899 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం 12,479 మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో 2వేల మందిని ఎంపిక చేయనున్నారు. బుధవారం కొంగరకలాన్లోని రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే కార్యక్రమంలో ఈ ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు.
ఇండ్ల నిర్మాణాలు ఎక్కడెక్కడంటే..
రంగారెడ్డి జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లోని 29 ప్రాంతాల్లో ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్నది. మహేశ్వరం నియోజకవర్గంలోని కుర్మల్గూడ, మంకాల్, మల్లాపూర్, మంసాన్పల్లి, మొహబ్బత్నగర్లలో 9,892 ఇండ్ల నిర్మాణాలను రూ.883.81 కోట్లను వెచ్చించి నిర్మిస్తున్నది. వీటిల్లో 5,260 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నార్సింగి, బైరాగిగూడ, మైలార్దేవ్పల్లిలలో రూ.63.23 కోట్లను వెచ్చించి 696 ఇండ్ల నిర్మాణాలను చేపడుతుండగా.. ఇప్పటివరకు 396 ఇండ్లు నిర్మాణాలను పూర్తిచేసుకున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో ఎరుకల నాచారంనగర్, బాగ్ హయత్నగర్, జై భవానీ నగర్, కర్మన్ఘాట్ ప్రాంతాల్లో 944 ఇండ్లను రూ.86.26 కోట్ల వ్యయంతో చేపడుతుండగా.. ఇప్పటివరకు 612 ఇండ్లు పూర్తయ్యాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సాయినగర్ హఫీజ్పేట్, నల్లగండ్ల ప్రాంతాల్లో 344 ఇండ్లను రూ.30.32 కోట్లను వెచ్చించి ప్రభుత్వం నిర్మిస్తున్నది. దాదాపు అన్ని ఇండ్లు పూర్తయ్యాయి.
మోడల్ కాలనీలుగా తీర్చిదిద్ది..
కేవలం డబుల్ బెడ్రూం ఇండ్లను మాత్రమే నిర్మించి వదిలేయకుండా ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను సమకూర్చుతున్నది. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను మోడల్ కాలనీలుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ధనిక వర్గాల ప్రజలు నివసించే ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోకుండా అధునాతనమైన సౌకర్యాలతో ఇండ్లను నిర్మించగా.. వసతులు సైతం అదే స్థాయిలో ఉంటున్నాయి. మంచి నీటి ట్యాంకుల నిర్మాణం, మురుగునీటి సౌకర్యం, రహదారులు, విద్యుత్ సౌకర్యం, మిషన్ భగీరథ పథకం కింద తాగు నీటి సౌకర్యం వంటి ప్రాథమిక మౌలిక వసతులను కల్పిస్తున్నారు. చాలా చోట్ల మౌలిక సదుపాయాల కల్పన పనులు ఇప్పటికే తుది దశకు చేరాయి.
పారదర్శకంగా ఎంపిక
డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. గతంలో లబ్ధిదారుల పేర్లు, నంబర్లను డబ్బాలో వేసి లక్కీ డ్రా తీయడం ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను నిర్వహించేవారు. దీనిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రభుత్వం ‘ర్యాండమైజేషన్’ నమూనాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపడుతున్నారు. ఇందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తక్కువ సమయంలోనే పూర్తవుతుంది. ఆధార్కార్డును ప్రాతిపాదికగా చేసుకుని సాఫ్ట్వేర్ను రూపొందించడం వల్ల ఒకసారి లబ్ధిపొందిన వారు మళ్లీ ఎంపికయ్యే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇండ్లు పొందిన లబ్ధిదారుల పేర్లను చూసుకునేందుకు ప్రత్యేక డిజిటల్ డిస్ప్లేలను ఏర్పాటు చేస్తున్నారు.