ఇబ్రహీంపట్నం, మే 7;‘మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలు సమకూరి సర్కారు బడుల రూపురేఖలు మారాయి. కార్పొరేట్కు దీటుగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. తల్లిదండ్రులపై భారం పడకుండా స్కూల్ యూనిఫాంలు, మధ్యాహ్న భోజనంతో పాటు ఉచితంగా పుస్తకాలు, నోటు పుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో ఈ విద్యా సంవత్సరం వికారాబాద్ జిల్లాలో 83,461 మంది విద్యార్థులకు, రంగారెడ్డి జిల్లాలో 1,86,017 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నది. విద్యా రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుండడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
/పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సర్కారు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నది. ఇప్పటికే ప్రతి విద్యార్థికి యూనిఫారం, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందించడంతోపాటు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టడం వంటి అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్న ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ప్రతి విద్యార్థికి ఉచితంగా నోటు పుస్తకాలు అందించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేనాటికి నోటు పుస్తకాలు కూడా పాఠశాలలకు చేరవేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. దేశానికే తలమానికంగా నిలిచేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉచితంగా వర్క్బుక్స్, నోటు పుస్తకాల పంపిణీతో పేద విద్యార్థుల కుటుంబాలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా విద్యార్థుల చదువులు నిరాటంకంగా కొనసాగాలనే సత్సంకల్పం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
వికారాబాద్ జిల్లా పరిధిలో 771 ప్రాథమిక, 116 ప్రాథమికోన్నత, 176 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులందరికీ ఉచితంగా వర్క్బుక్స్, నోటు పుస్తకాలు అందించనున్నారు. వాటితోపాటు ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫారం సైతం అందించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలు అందజేసేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
83,461 మంది
విద్యార్థులకు ప్రయోజనం
ప్రభుత్వం వర్క్బుక్స్, నోటుపుస్తకాల పంపిణీ నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో 83,461 మంది పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలోని 771 ప్రాథమిక పాఠశాలల్లో 37,961 మంది విద్యార్థులు, 116 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10,334 మంది, 176 ఉన్నత పాఠశాలల్లో 35,166 మంది విద్యార్థులు నూతన విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం చేయనున్నారు. తద్వారా జిల్లావ్యాప్తంగా సర్కారు బడుల్లో చదువుకుంటున్న ప్రాథమిక విద్యార్థులకు అవసరమైన వర్క్బుక్స్, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలు ప్రభుత్వం ఉచితంగా అందజేయనుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలలతోపాటు కేజీబీవీ, తెలంగాణ గురుకులాలు, మోడల్ స్కూల్స్, అర్బన్ రెసిడెన్షియల్స్లో చదువుకుంటున్న వారికి కూడా ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయనున్నారు. సబ్జెక్టుకు ఒకటి చొప్పున నోటు పుస్తకాలను సమగ్ర శిక్షా ప్రాజెక్టు ద్వారా పంపిణీకి సర్కారు నిర్ణయించింది. వేసవి సెలవులు ముగిసిన వెంటనే నోటు పుస్తకాలు అందజేసే కార్యక్రమం చేపడుతారు.
ఉచితంగా పాఠ్యపుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు
జిల్లా పరిధిలోని సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేసేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని సర్కారు బడులలో చదువుకునే విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమం కలిపి మొత్తం 8,12,192 పాఠ్య పుస్తకాలు అవసరమని అధికారులు అంచనాలు తయారు చేశారు. గత సంవత్సరం పంపిణీ చేయగా మిగిలిపోయిన 32,882 పాఠ్య పుస్తకాలు వికారాబాద్ బుక్ డిపోలో ఉన్నాయి. దీంతో 7,79,310 పాఠ్య పుస్తకాలు అవసరముండగా ఇప్పటికే 2,94,510 పాఠ్య పుస్తకాలు వికారాబాద్ బుక్డిపోకు తరలించారు. ఇంకా 4,84,800 పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉన్నది. వాటిని ఈ నెలాఖరు లోపు బుక్డిపోకు చేరవేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అనంతరం జూన్ మొదటి వారంలోనే అన్ని మండల కేంద్రాల్లోని మండల విద్యా వనరుల కేంద్రాలకు, అక్కడి నుంచి సంబంధిత పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు తరలించనున్నారు. తద్వారా పాఠశాలలు పునః ప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంచేలా విద్యాశాఖాధికారులు కృషి చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా 1420 పాఠశాలలు, 1,86,017మంది విద్యార్థులు
ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1420 పాఠశాలల్లో, 1,86,017 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి పాఠశాలల ప్రారంభం రోజు జూన్ 12న ఉచితంగా నోటుబుక్స్, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్కులను అందించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. యూనిఫాంలు కూడా అందజేయనున్నారు. ఇందుకోసం ఆయా ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వివరాలను జిల్లావిద్యాశాఖ అధికారులకు పంపేలా చర్యలు తీసుకుంటున్నారు.
విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది ; పరమేశ్, ప్రధానోపాధ్యాయుడు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా నోటుపుస్తకాలు అందించాలన్న విషయం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎంతో మనోధైర్యాన్నిచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందిస్తున్నది. ఈ ఏడాది కొత్తగా నోటు పుస్తకాలు, వర్క్బుక్లను అందించాలని తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఈ నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నోటుపుస్తకాలు అందజేస్తాం ; సుశీందర్రావు, డీఈవో, రంగారెడ్డి జిల్లా
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నోటు పుస్తకాలు, వర్క్బుక్లను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే జాబితాను కూడా అధికారులకు చేరవేశాం. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.