కేశంపేట, మే 24 : గుంతలమయంగా మారిన రోడ్డుతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. బీటీ రోడ్డు నిర్మాణం కోసం ఎన్నో ఏండ్లుగా ప్రజలు కన్న కల సాకారమవుతున్నది. కేశంపేట మండలం సంగెం నుంచి కొత్తూరు మండలం జేపీ దర్గా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై పనులు ప్రారంభించారు. పనులు కొనసాగుతున్నాయి. పనుల్లో నాణ్యత లోపించకుండా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పనులు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రోడ్డు అడుగడుగున గుంతలమయంగా మారి ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేశంపేట మండలంలోని గ్రామాల నుంచి రైతులు పాలు, కూరగాయలు, పండించిన ధాన్యాన్ని కొత్తూరు, శంషాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించేందుకు ఈ రోడ్డు మీదుగా వెళ్లాల్సిందే. గతంలో హైదరాబాద్లోని పలు డిపోల నుంచి కేశంపేట మండలంలోని సంగెం, వేములనర్వ, కేశంపేట, చింతకుంటపల్లి తదితర గ్రామాలకు నడిచిన సిటీ బస్సులు రోడ్డు బాగా లేక రద్దు అయ్యాయి. దీంతో రైతులు, విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ వెళ్లాలంటే షాద్నగర్ మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. రోడ్డు దుస్థితిపై ఆయా గ్రామాల ప్రజల విన్నపం మేరకు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. రోడ్డు నిర్మాణం కోసం 1.65 కోట్ల రూపాయలు ఆర్ఆర్బీ నిధులను మంజూరు చేయించి పనులను ప్రారంభించారు. మరో 20 రోజుల్లో రోడ్డు నిర్మాణ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు మండలంలోని గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.