చేవెళ్ల రూరల్, జూలై 30 : 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలకు బుద్ధి చెప్పాలంటే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమష్టిగా, పట్టుదలతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి దిశానిర్దేశం చేశారు. బుధవారం చేవెళ్ల మండల పరిధి ముడిమ్యాల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు 50 మందికి పైగా నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్రెడ్డి, సీనియర్ నాయకులు గోనె కరుణాకర్రెడ్డి, శేరి రాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రి సబితారెడ్డి సమక్షంలో నగరంలోని ఆమె నివాసంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి సబితారెడ్డి బీఆర్ఎస్ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన నాటి నుంచి ఈ 20 నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదని, ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీలిచ్చి విస్మరించిందని సబితారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పల్లెల్లో ప్రగతి పరుగులు పెట్టేదని, రేవంత్ సర్కార్లో గ్రామాలు అధోగతిపాలయ్యాయన్నారు. మౌలిక వసతులు లేక గ్రామాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేత ధోరణితో.. ఎక్కడా అభివృద్ధి చేయకుండా మాటలతో సర్కారును ముందుకు తీసుకెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సమష్టిగా ముందుకు సాగి ప్రజల మన్ననలు పొంది స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేలా శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశిపాల్, బీఆర్ఎస్ నాయకులు షేక్ ఆరిఫ్ మియా, గోనె మాధవరెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఊరడి రాములు, గౌడిచర్ల రమేశ్, గోనె మోహన్ రెడ్డి, జూకంటి గోవర్ధన్, కుమ్మరి శ్రీకాంత్, కమ్మరి మహేశ్చారి, ఊరడి అంజయ్య, బేగరి సతీష్, జొన్నాడ రమేశ్, ఊరడి చిన్న రాములు, ఊరడి మల్లేశ్, ఊరడి విఠల్, పులకంటి నర్సింహులు, ఊరడి మహేందర్, గౌడిచర్ల జైపాల్, పి.బద్రీ, మాదగాని ప్రవీణ్గౌడ్, యంజాల మహేందర్ తదితరులున్నారు.