కొడంగల్, డిసెంబర్ 6 : గతంలో రెండు పర్యాయాలు రేవంత్ను కొడంగల్ ప్రజలు నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని.. అప్పట్లో ఏమీ ఒరగబెట్టని కారణంగా రేవంత్ పాపాన్ని తాను 4 సంవత్సరాలుగా కడుగుతున్నానని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ నిర్వాకాన్ని ఎండగట్టారు. గతంలో సీఎం కేసీఆర్ పార్టీలకతీతంగా కొడంగల్ అభివృద్ధికిగాను రూ.430కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రేవంత్ ఎటువంటి అభివృద్ధి పనుల చేపట్టకుండా కొడంగల్ను ఏడారిగా మార్చిండని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల కాలంగా కొడంగల్ను రూ.530కోట్ల నిధులతో అభివృద్ధి పనులు నిర్వహిస్తూ.. కొడంగల్ ప్రజలకు అండగా ప్రభుత్వం నిలుస్తున్నదని పేర్కొన్నారు. రేవంత్ పదేండ్ల పాలనలో కొడంగల్ ఏవిధంగా ఉంది.. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా గెలిచిన 4 సంవత్సరాల తరువాత కొడంగల్ నియోజకవర్గం ఏవిధంగా ఉందో గ్రామ, పట్టణ, మున్సిపల్ ప్రాంతాలను తిరిగితే తెలుస్తుందని హితవు పలికారు. కొడంగల్కు వచ్చి ఇంట్లో కూర్చొని మీడియాతో అర్థంలేని మాటలు మాట్లాడితే కొడంగల్ ప్రజల పరిస్థితి అర్థం కాదని.. ఎల్లకాలం ప్రజల మధ్యన ఉంటూ.. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని సమస్యలను పరిష్కరిస్తే తెలుస్తుందన్నారు.
కొడంగల్ ప్రజలకు అండగా నిలుస్తూ
ప్రస్తుతం ఎన్నికల వాతావరణం ప్రారంభం కావస్తున్నదని గ్రహించిన రేవంత్ ప్రజల్లోకి వచ్చి మాయమాటలతో మళ్లీ మోసం చేసేందుకు సిద్ధపడుతున్నారన్నారు. కొడంగల్ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయడం కాదు.. నిజాయితీగా కొడంగల్, కోస్గి మున్సిపల్ ప్రాంతాల్లో పర్యటిస్తే అభివృద్ధి రేవంత్ కంటికి కనబడుతుందన్నారు. గతంలో ముండ్ల కంపలు, గుంతలమయంగా రోడ్లు, అడ్డదిడ్డమైన వ్యవస్థ అందుబాటులో ఉండేదని.. ప్రసుత పరిస్థితిని చూసి వాస్తవాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. రేవంత్రెడ్డిలా మాటలు చెప్పే మనస్తత్వం తనది కాదని.. నమ్ముకున్న కొడంగల్ ప్రజలకు అండగా నిలుస్తూ.. ప్రత్యక్షంగా ప్రతి గ్రామాన్ని, గడపగడపకు తిరిగి వారి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నానని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకొనైనా నిధులు మంజూరు చేయిస్తా..
గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొడంగల్ ప్రజలు పెట్టిన భిక్ష అని.. ప్రస్తుతం కొడంగల్ ప్రజల భిక్షతోనే ఎంపీగా, కాంగ్రెస్ పీపీసీ అధ్యక్షుడిగా చలామణి అవుతున్నట్లు గుర్తుంచుకోవాలన్నారు. గత ఎన్నికల్లో కొడంగల్కు సిమెంట్ ఫ్యాక్టరీ, సాగునీరు, రైల్వే లైను తీసుకొస్తానని కటౌట్లు పెట్టుకొని ప్రచారం చేసుకున్న నీవు.. ఎంపీగా ఒక్కసారైనా రైల్వే లైను, సిమెంట్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడిన పాపాన పోయావా అని ప్రశ్నించారు. రైల్వే లైను అనుమతికి సంబంధించి సీఎం కేసీఆర్ వద్ద ఫైలు ఉందని గప్పాలు కొట్టడం కాదు.. కేంద్రం మెడలు వంచి కేంద్రం అందించాల్సిన నిధులు మంజూరు చేయిస్తే.. సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకొనైనా రాష్ట్ర నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే సవాల్ విసిరారు.
రేవంత్తోనే కాంగ్రెస్ పతనం ప్రారంభం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపు 80శాతం పూర్తయ్యాయని.. కేవలం కాంగ్రెస్ నాయకుల అడ్డుకోవడంతోనే 20శాతం పనులు ఆలస్యమవుతున్నట్లు పేర్కొన్నారు. 190 బీఫాంలు ఇచ్చే నాయకుడనని విర్రవీగడం కాదు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుమ్ములాటలను గురించి ఆలోచించాలని హితవు పలికారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని, హుజూరాబాద్ ఎన్నికల్లో కేవలం 3వేల ఓట్లు.. మునుగోడు ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు కావడం దీనికి నిదర్శనంగా పేర్కొన్నారు.
దమ్ముంటే కొడంగల్లో పోటీ చేయి..
దమ్ముంటే కొడంగల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. సీట్లను అమ్ముకోవడానికే పీసీసీ పదవిని కొనుక్కున్నావని.. తాండూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఒకరితో రూ.25లక్షల ఒప్పందం కుదుర్చుకోవడం ఇందుకు సాక్ష్యంగా పేర్కొన్నారు. గతంలో కొడంగల్ అభివృద్ధి పనులు మంజూరు చేయించానని మాయమాటలు చెప్పుకోవడం కాదు, గడిచిన 10 సంవత్సరాల్లో ఎందుకు పూర్తి చేయలేదో కొడంగల్ ప్రజలకు తెలపాలని ప్రశ్నించారు.
ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు
కొడంగల్ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెద్ద సంస్థలకు సంబంధించిన ఫ్యాక్టరీ ఏర్పాటుకు మంత్రి కేసీఆర్తో సంప్రదించానని, త్వరలో ఫాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు హామీ ఇచ్చారు. అభివృద్ధికి సంబంధించి మరో రూ.80కోట్లు ప్రభుత్వం నుంచి మంజూరయ్యాయని. త్వరలో పనులను గుర్తించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో దౌల్తాబాద్ జడ్పీటీసీ మహిపాల్, దౌల్తాబాద్ ఎంపీపీ విజయ్కుమార్, పీఏసీఎస్ అధ్యక్షులు శివకుమార్, విష్ణువర్ధన్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు మధుసూదన్యాదవ్, దుద్యాల మండల అధ్యక్షుడు చాంద్పాషా, పర్సాపూర్, చిట్లపల్లి సర్పంచ్లు సయ్యద్ అంజద్, వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, సాయిలు, రమేశ్బాబు, నవాజొద్దీన్ పాల్గొన్నారు.