కొడంగల్, జూలై 15 : సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధి పేరుతో కొడంగల్ను విధ్వంసం చేయాలని చూస్తున్నారని.. ఒక్క రోడ్డు వేస్తేనే అభివృద్ధి కాదని..ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని స్థానికులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో లాహోటీ కాలనీపార్కు నుంచి బాపల్లి రోడ్ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టే క్రమంలో వికారాబాద్ అదనపు కలెక్టర్ వెంకటాచారి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా రోడ్డు విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోనున్న బాధితులు మాట్లాడుతూ.. కొన్నేండ్లుగా ఈ రోడ్డుపైనే షాపులను ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నామని.. ఆ దుకాణాలే లేకుంటే మా జీవనం ఎలా అని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే.. ఉన్న కొద్దిపాటి స్థలంలో ఇంటిని నిర్మించుకొని పిల్లాపాపలను పోషించుకొంటూ బతుకుతున్నామని.. ఆ ఇండ్లు కోల్పోతే ఎక్కడికెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో స్థలాన్ని కొనలేము.. ఇంటినీ నిర్మించుకోలేమన్నారు.
పట్టణంలోని మహాలక్ష్మీవేంకటేశ్వరాలయాన్ని అభివృద్ధి చేయడం సంతోషకరమైనా.. ఇండ్లు, షాపులను కోల్పోవడం చాలా బాధగా ఉం దన్నారు. ఆలయాభివృద్ధిలో భాగంగా రోడ్డు నిర్మాణం జరుగుతుందని అధికారులు పేర్కొనడం చాలా విడ్డూరం గా ఉందన్నారు. ఆ ఆలయానికి వెళ్లేందుకు మరో మూడు మార్గాలున్నా ఈ రోడ్డునే అభివృద్ధి చేయాలని సీఎం ఎందుకు పట్టుబడుతున్నారో అతడి ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ప్రజలు పేర్కొన్నారు. ఏకంగా 50 ఫీట్ల రోడ్డు నిర్మాణంతో ఎంతోమంది నిరాశ్రయులు అవుతారని.. అభివృద్ధి పేరుతో ఇండ్లు, షాపులను కూల్చివేస్తే కొడంగల్లో ప్రజాజీవనం అతలాకుతలం అవుతుందని.. రోడ్డు వద్దు.. విస్తరణ వద్దని.. కరాఖండిగాప్రజలు, వ్యాపారులు తేల్చి చెప్పారు.

ప్రజలకు సౌకర్యంగా ఉండేలా రోడ్డు విస్తరణ పనులు చేపట్టేలా ప్రభుత్వం ఆలోచిస్తుందని.. అందుకోసమే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్టు వికారాబాద్ అదనపు కలెక్టర్ వెంకటాచారి పేర్కొన్నారు. పట్టణంలోని లాహోటీ కాలనీ పార్కు నుంచి బాపల్లి రోడ్డు జంక్షన్ వరకు 50 ఫీ ట్ల రోడ్డు విస్తరణకు భూములను సేకరిస్తామన్నారు. రోడ్డు విస్తరణలో రెండెకరాల 7 గంటల స్థలం, 11,770 చదరపు గజాల స్థల సేకరణలో 187 మందికి సంబంధించి 137 నివాస స్థలాలను గుర్తించామని.. కొందరు నివాస, వ్యాపార స్థలాలు కోల్పోతారని.. ఏండ్లుగా కొడం గల్ వెనుకబాటులో ఉందని.. ప్రస్తుతం చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ సభలో సేకరించిన ప్రజాభిప్రాయాన్ని ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే పూర్తి స్థాయి నిర్ణయం ఉంటుందన్నారు. కార్య క్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, వైస్ చైర్మన్ శంకర్నాయక్, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్, మున్సిపల్ కౌన్సిలర్లు, రోడ్డు విస్తరణ బాధితులు తదితరులు పాల్గొన్నారు.
కొన్నేండ్లుగా ఇండ్లను నిర్మించుకొని సంతోషంగా జీవిస్తున్నాం. ఇప్పుడ ఒక్కసారిగా కొడంగల్ను అభివృద్ధి చేస్తున్నాం ఇంటిని అప్పగించాలని ఒత్తిడి చేస్తే ఎక్కడికెళ్లాలి..ఎలా జీవించాలి.లక్షల వెచ్చించి ఇంటిని నిర్మించుకున్నాం. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో మళ్లీ ఇంటిని నిర్మించుకోవడం చాలా కష్టం. మా జీవనానికి ముప్పు తీసుకొచ్చే ఈ రోడ్డు విస్తరణ వద్దు. మాకు అభివృద్ధి వద్దే..వద్దు. ఎవరిని అడిగి సర్వే చేశారు. సర్వే చేసే ముందు ప్రజాభిప్రాయం తీసుకోవాలి కాదా..?
– శాంతకుమార్, రోడ్డు విస్తరణ బాధితుడు, కొడంగల్
అభివృద్ధి పనులు చేయడంలో అన్ని మతాలను కలుపుకొనిపోవాలి. పట్టణంలో చేపట్టే రోడ్డు విస్తరణతో ముస్లింలకు చెందిన మూడు శ్మశానవాటికలకు ఇబ్బంది కలుగుతుంది. ఇదివరకే మున్సిపల్ కార్యాలయం దగ్గరలోని దర్గా కూల్చివేసి, మళ్లీ నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి ముస్లిం లకు హామీ ఇచ్చారు. ఏడాది గడుస్తున్నా నేటికీ పురోగతి లేదు. కోల్పోతున్న శ్వశానవాటికలకు ఇతర ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వాలి.
-శేక్ రుమాన్, కొడంగల్
లాహొటీ పార్కు నుంచి బాపల్లి రోడ్డు జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టడం ఎవరికోసమో, ఎందుకో అర్థం కావడం లేదు. అభివృద్ధికి సహకరిస్తాం. కానీ జనసంచారం, జనానికి ఆమోదయోగ్యంగా ఉండే అభివృద్ధి పనులు చేపట్టాలి. ఏండ్లుగా ఈ రోడ్డు ఒక్కచోటే వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అటు వంటి రోడ్డుపై ఉన్న ఇండ్లు, దుకాణాలను తొలగిస్తామంటే బత కడం ఏలా.. రోడ్డు విస్తరణలో మరో మారు సర్వే చేసి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉం డేలా రూట్ ఏర్పాటు చేయాలి. వ్యాపార స్థలాలు కోల్పోతున్న వారికి పట్టణ ప్రధాన రోడ్డుపై ఉన్న ప్రభుత్వ స్థాలాల్లో దుకాణాలను నిర్మించి ఇవ్వాలి. ఇలా చేస్తే ఇండ్లు పోయినా ఉపాధినికి దక్కించుకునే ఆస్కారం ఉంటుంది.
-కోట్రికె లక్ష్మీనారాయణ, రోడ్డు విస్తరణ బాధితుడు, కొడంగల్