అరకొర వేతనాలు.. కుటుంబం గడువక అష్ట కష్టాలు.. ఇది రాష్ట్రం రాక ముందు అంగన్వాడీలు అనుభవించిన బాధలు. రాష్ట్రం సిద్ధించాక అంగన్వాడీ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వరాల జల్లులు కురిపిస్తూ అంగన్వాడీ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. రాష్ట్ర సర్కార్ ఇప్పటికే మూడుసార్లు వేతనాలను పెంచింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయో పరిమితిని 65 ఏండ్లకు పెంచి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. రిటైర్మెంట్ తర్వాత కూడా వారు బాగుండాలనే సదుద్దేశంతో టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50వేలు ఇవ్వడంతో పాటు ఆసరా పింఛన్ సైతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. రంగారెడ్డి జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,380 ప్రధాన, 220 వరకు మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో 1,560 మంది టీచర్లు, 1,268 మంది హెల్పర్లకు లబ్ధి చేకూరనున్నది. దీంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నాయి.
– రంగారెడ్డి, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో అరకొర వేతనాలతో అష్టకష్టాలు పడ్డ అంగన్వాడీ ఉద్యోగుల కుటుంబాల్లో తెలంగాణ ప్రభుత్వం వెలుగులు నింపింది. స్వరాష్ట్రంలో ముచ్చటగా మూడుసార్లు వేతనాలను పెంచిన సీఎం కేసీఆర్ తాజాగా.. అంగన్వాడీ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65ఏండ్లకు పెంచడమే కాకుండా..ఉద్యోగ విరమణ పొందిన అంగన్వాడీ టీచర్లకు సర్వీస్ బెనిఫిట్స్ కింద రూ.లక్ష, హెల్పర్స్కు రూ.50వేలను ప్రభుత్వం అందించనున్నది. ఉద్యోగ విరమణ పొందిన టీచర్లు, హెల్పర్లకు నెలనెలా ఆసరా పింఛన్ను సైతం ఇవ్వనున్నది. ఫలితంగా రంగారెడ్డి జిల్లాలో 2,828 టీచర్లు, హెల్పర్లకు ప్రయోజనం కలుగనున్నది. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలకు అప్గ్రేడ్ చేయనుండడంతో జిల్లాలో 220 కేంద్రాలు అప్గ్రేడ్కు నోచుకోనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం వాటాలో కోత పెట్టినా..
అంగన్వాడీలకు అందిస్తున్న వేతన కోటాలో కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా కోతపెడుతూ వస్తున్నది. అలాగే..స్వరాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆయా వర్గాలు ఉద్యోగ భద్రత, వేతనాల కోసం ధర్నాలు, నిరసనలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ భద్రత కోసం అనేక నిర్ణయాలు తీసుకుని ఉద్యోగుల పక్షపాతిగా నిలిచారు. గతంలో వేతన పెంపుపై అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం..కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు గౌరవ వేతనం అందుకుంటున్న చిరుద్యోగులందరికీ వేతనాలు పెంచారు. ఫలితంగా జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులు, ఆశ వర్కర్లతోపాటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 30 శాతం మేర గౌరవ వేతనాలను ప్రభుత్వం పెంచింది. ఏడేండ్లలో మూడురెట్ల కంటే అధికంగా టీచర్లకు 325 శాతం, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు మూడున్నర రెట్లు అంటే 354 శాతం పెరిగింది. గతంలో రెండోసారి వేతనాల పెంపు సందర్భంగా సీఎం కేసీఆర్ అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రగతి భవన్కు పిలిపించుకుని భోజనం చేయడంతోపాటు వేతన పెంపునకు సంబంధించి తీపి కబురు అందించారని జిల్లాకు చెందిన అంగన్వాడీ ఉద్యోగులు గత జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
220 మినీ అంగన్వాడీల అప్గ్రేడ్
రంగారెడ్డి జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,380 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 220 వరకు మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్, హెల్పర్ చొప్పున జిల్లా వ్యాప్తంగా 1,560 మంది టీచర్లు, 1,268 మంది హెల్పర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో మినీ అంగన్వాడీ కేంద్రాల పరిధి, సేవలను విస్తరించాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం విధివిధానాలను వెల్లడించనున్నది. అప్గ్రేడ్ చేయడం వల్ల మరో సహాయకురాలి సేవలు అవసరం పడనుండడంతో వారి నియామక భర్తీకి సైతం ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. అంగన్వాడీ ఉద్యోగుల శ్రమను గుర్తించి తగు రీతిలో ప్రయోజనాలు కల్పిస్తున్నారని అంగన్వాడీ ఉద్యోగులు సీఎం కేసీఆర్ను కొనియాడుతూ సంబురాలు చేసుకుంటున్నారు.
జీతాలు పెంచి ఆదుకున్నరు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు అంగన్వాడీ టీచర్లకు సరైన వేతనాల లేవు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు గడువడం కూడా చాలా కష్టంగా ఉండేది. గత ప్రభుత్వాల హయాంలో అంగవాడీ టీచర్ల వేతనాలు రూ.7 వేలు, ఆయాలకు రూ.3 వేలు ఉండగా, సీఎం కేసీఆర్ టీచర్లకు రూ.13560, ఆయాలకు రూ.7800లకు పెంచి ఆదుకుంటున్నరు. మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తామని ప్రభుత్వం చెప్పడం సంతోషకరం. – ఎం కవిత, హిమాయత్నగర్, సెంటర్-2, మొయినాబాద్
ఉమ్మడి పాలనలో వేతనాలు ఇలా..
అంగన్వాడీ టీచర్లు రూ.4,200
మినీ అంగన్వాడీ టీచర్లు రూ.2,200
హెల్పర్స్ రూ.2,200
అంగన్వాడీల బతుకులకు భరోసా..
అంగన్వాడీ టీచర్ల సమస్యలను గతంలో ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ వల్ల అంగన్వాడీల బతుకులకు భరోసా ఏర్పడింది. మూడు విడుతల్లో వేతనాలను పెంచారు. ఉద్యోగ విరమణ వయో పరిమితిని పెంచడంతో పాటు పారితోషికం ఇవ్వాలని నిర్ణయించడం సంతోషకరం. అంగన్వాడీల బాగు కోసం ఆలోచించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీచర్లు, హెల్పర్లు అంతా రుణపడి ఉంటాం.
– భారతి, తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, ఇంద్రారెడ్డినగర్, చేవెళ్ల మండలం
పెంచి ఆదుకున్నరు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక ముందు అంగన్వాడీ టీచర్లకు సరైన వేతనాల లేవు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు గడువడం కూడా చాలా కష్టంగా ఉండేది. గత ప్రభుత్వాల హయాంలో అంగవాడీ టీచర్ల వేతనాలు రూ.7 వేలు, ఆయాలకు రూ.3 వేలు ఉండగా, సీఎం కేసీఆర్ టీచర్లకు రూ.13560, ఆయాలకు రూ.7800లకు పెంచి ఆదుకుంటున్నరు. మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తామని ప్రభుత్వం చెప్పడం సంతోషకరం.
– ఎం కవిత, హిమాయత్నగర్, సెంటర్-2, మొయినాబాద్
మూడు సార్లు వేతనాలు పెంచారు
సీఎం కేసీఆర్ అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలు 3 సార్లు పెంచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అంగన్వాడీ టీచర్ జీతం కేవలం రూ. 4200 ఉండేది. ప్రస్తుతం రూ.13,650 వస్తుంది. హెల్పర్స్కు గతంలో రూ.2,200 మాత్రమే ఉండేది. ప్రస్తుతం రూ.7800 వస్తుంది. టీచర్లు, సహాయకుల పదవీ విరమణ వయస్సు 65 ఏండ్లకు పెంచుతూ పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప విషయం.
– రాజ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్, ఆమనగల్లు
ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు
గతంలో అంగన్వాడీలను ఏ ప్రభుత్వాలు పట్టించుకున్న పాపానపోలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడీల వేతనాలు పెంచటంతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నది. అలాగే, ఇటీవల అంగన్వాడీలకు వయోపరిమితి పెంచటం ఎంతో సంతోషించదగ్గ విషయం. ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– సవిత, అంగన్వాడీ టీచర్, నక్కర్త మేడిపల్లి (ఇబ్రహీంపట్నం)
ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం
ముఖ్యమంత్రి కేసీఆర్ మాలాంటి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న ఆయాలకు జీతాలు పెంచి ఆదుకున్నాడు. అలాగే, ఇటీవల వయోపరిమితి పెంచుతామని ప్రకటించినట్లు మా టీచరు చెప్పింది. అంగన్వాడీల్లో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న మాలాంటి ఆయాలు, టీచర్లను ఆదుకోవటం సంతోషకరం. ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– ప్రేమలత, అంగన్వాడీ ఆయా, (ఇబ్రహీంపట్నం)
గొప్ప విషయం
అంగన్వాడీ టీచర్ల కష్టాలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు. పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచడం గొప్ప విషయం. సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా అంగన్వాడీలను పట్టించుకున్న దాఖలాలు లేవు. అంగన్వాడీ టీచర్ల పదవీ విరమణ తరువాత కష్టాలను గుర్తించి పింఛన్ ఇస్తామనడం హర్షణీయం.
– లక్ష్మీ, శంకర్పల్లి
సీఎం కేసీఆర్తోనే గుర్తింపు..
గత ప్రభుత్వ పాలకుల హయాంలో అరకొర జీతాలతో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ మూడుసార్లు జీతాలను పెంచి ఆదుకున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, మినీ టీచర్లు రూ.7,800లు, హెల్పర్లు రూ.7,800 ఇస్తుండ్రు. ఉద్యోగ విరమణ వయస్సును 65 పెంచడంతోపాటు టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేలు అందజేస్తామని ప్రకటించడం హర్షణీయం.
-పాత్లావత్ కమల, అంగన్వాడీ టీచర్, వాసుదేవ్పూర్