ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్లు సగానికిపైగా పడిపోయాయి. భూముల విలువ పెంపుతో వ్యవసాయ భూములతోపాటు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు అమాంతం పడిపోయాయి. భూముల విలువ పెంపునకు ముందు వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారితో కిక్కిరిసిపోగా, గత వారం రోజులుగా రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో సంబంధిత కార్యాలయాలు బోసిపోయాయి. భూముల విలువను వ్యవసాయ భూములతోపాటు అపార్ట్మెంట్ల విలువవ గతంతో పోలిస్తే భారీగా పెరగడంతో రిజిస్ట్రేషన్లకు ముందుకు రావడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. భూముల విలువను పెంచితే రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుందని భావించిన ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
రంగారెడ్డి, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఆదాయంలో 60 శాతం రంగారెడ్డి జిల్లా నుంచే వచ్చేది. జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, గండిపేట్, రంగారెడ్డి, రాజేంద్రగనగర్, మహేశ్వరం, అబ్దుల్లాపూర్మెట్, వనస్థలిపురం, షాద్నగర్, ఫరూఖ్నగర్ వంటి ఎస్ఆర్వోల పరిధిలో గతంలో రోజుకు వందకు పైగా రిజిస్ట్రేషన్లు అయ్యేవి. భూముల మార్కెట్ విలువ పెంచిన తర్వాత వీటి పరిధిలో 30 నుంచి 40 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయం కూడా యాభై శాతం పడిపోయింది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు క్రయవిక్రయదారులు లేక బోసిపోతున్నాయి.
జిల్లాలో 18 రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. వీటిలో అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజువారీగా నిర్ణీత స్లాట్లన్నీ బుక్కయ్యేవి. ఏటా జిల్లా నుంచి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వంద కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. భూముల మార్కెట్ విలువలు పెంచడంతో భూములు కొనుగోలు చేసిన దాంట్లో సుమారు 30 శాతం వరకు మార్కెట్ విలువలకే చెల్లించాల్సి వస్తున్నది. రిజి్రస్ట్రేషన్ల పెంపునకు ముందు నాలుగు రోజుల వరకు స్లాట్ బుకింగ్లు అధికంగా ఇవ్వడంతో 150 వరకు జరిగేవి, ప్రస్తుతం సగం కూడా రిజిస్ట్రేషన్లు జరగడంలేదు. భూముల మార్కెట్ విలువలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు బోసిపోతున్నాయి. రోజుకు రెండు నుంచి ఐదు వరకు డాక్యుమెంట్లు జరిగేవని.. ప్రస్తుతం ఒక్క డాక్యుమెంట్ కూడా రావడంలేదని డాక్యుమెంట్ రైటర్లు వాపోతున్నారు.
వికారాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వ్యవసాయ భూముల విలువను 50-60 శాతానికి పెంచగా, అపార్ట్మెంట్ల విలువను 20 శాతానికిపైగా పెంచారు. ఈ నెల 5 నుంచి మంగళవారం వరకు జిల్లా అంతటా అన్ని మండలాల్లో వ్యవసాయ భూములతోపాటు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఘోరంగా తగ్గుముఖం పట్టాయి. గతంలో వికారాబాద్ మండల పరిధిలో వ్యవసాయ భూముల విలువ అత్యధికంగా రూ.17 లక్షల వరకుండగా.. ప్రస్తుతం ఏకంగా రూ.38 లక్షలకు పెంచారు.
అలాగే వ్యవసాయేతర భూముల విలువ గతంలో గజం రూ.2 వేల వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.5 వేలకు పెంచారు.
జిల్లాలోని పూడూరు, నవాబుపేట, మోమిన్పేట్, వికారాబాద్, పరిగి తదితర తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఘోరంగా తగ్గిపోయాయి. జిల్లావ్యాప్తంగా గతంలో 350-400 వరకు రిజిస్ట్రేషన్లుకాగా, ప్రస్తుతం జిల్లా అంతటా 100 రిజిస్ట్రేషన్లకు మించడంలేదు. భూముల క్రయవిక్రయాలు అధికంగా జరిగే పూడూరు, నవాబుపేట, మోమిన్పేట్ మండలాల్లో గతంలో రోజుకు 30 రిజిస్ట్రేషన్లుకాగా, ప్రస్తుతం సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. తాండూరు మండలంలోనూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు గతంలో 15 వరకు జరగగా.. ప్రస్తుతం 5-6 రిజిస్ట్రేషన్లకు మించి కావడంలేదు. సర్కారు భూముల విలువను పెంచడంతోపాటు స్లాట్స్ సంఖ్యను కూడా పెంచింది.
స్లాట్స్ ఉన్నా రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు బోసిపోతున్నాయి. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఘోరంగా పడిపోయాయి. గతంలో వికారాబాద్, తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 20-30 వరకు రిజిస్ట్రేషన్లుకాగా.. ప్రస్తుతం 5-10 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతుండటం గమనార్హం. వికారాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం 20 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.