సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ దత్తత తీసుకోవడంతో కొడంగల్ నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. మౌలిక వసతులతో కొత్తరూపును సంతరించుకున్నది. గత నాలుగేండ్లలో రూ.1300 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రతి గ్రామానికీ రోడ్డు సౌకర్యం, వీధుల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. రూ.400 కోట్లతో గ్రామగ్రామానికీ లింక్ రోడ్లను నిర్మించారు. రూ.167కోట్ల నిధులతో మిషన్ భగీరథ పథకం గ్రిడ్, రూ.17కోట్లతో గ్రామాల్లో ట్యాంకులు, పైప్లైన్, ఇంటింటికీ నల్లాల ఏర్పాటు వంటి పనులు చేపట్టారు.
కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 కోట్లను కేటాయించగా పనులు జోరుగా సాగుతున్నాయి. కోస్గిలో బస్ డిపో, బస్స్టేషన్, కొడంగల్లో డిగ్రీ కాలేజీని అందుబాటులోకి తెచ్చారు. రూ.2.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్లు, రూ.1.50కోట్ల మున్సిపల్ కార్యాలయ భవనాల నిర్మిస్తున్నారు. అధునాతన గ్రంథాలయ భవనం, మినీ ఫుడ్జోన్, పంచతంత్ర పార్క్ను నిర్మించారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా కొడంగల్లో 50 పడకలు, మద్దూర్లో 30 పడకల దవాఖానలను అందుబాటులోకి తేగా, కోస్గిలో 50 పడకల దవాఖాన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. పల్లెలు, పట్టణాల్లో ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్లు, వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్లు ఏర్పాటు చేయడంతో ప్రజా సమస్యలకు పరిష్కారం లభించింది.
కొడంగల్ మార్చి 24 : స్వరాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గం ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అధిక మొత్తంలో నిధులు మంజూరయ్యాయి. అప్పట్లో అధికారంలో ఉన్నవారు కొడంగల్పై శ్రద్ధ చూపక నియోజకవర్గం అన్నింటా వెనుకబడింది. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విజయం సాధించడం, కొడంగల్ను మంత్రి కేటీఆర్ దత్తత తీసుకోవడంతో కొడంగల్ దశదిశ మారింది. గడిచిన నాలుగేండ్లలో రూ. 1300 కోట్లు మంజూరు కావడం గమనార్హం.
తీరిన లో ఓల్టేజీ సమస్య
లో ఓల్టేజీ సమస్యతో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు పదేపదే కాలిపోయి రైతులు ఇబ్బందులు పడేవారు. లో ఓల్టేజీ సమస్యను పరిష్కరించే ందుకు ప్రభుత్వం విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొడంగల్లో అన్నారం, దౌల్తాబాద్లో నర్సాపూర్తో పాటు బొంరాస్పేట మండలాల్లోని ఆయా గ్రామాల్లో 33/11 కేవీ ఉప కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఇంటింటికీ సంక్షేమ ఫలాలు
ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆసరా పింఛన్ల కింద కొడంగల్లో 2569 మందికి, కొడంగల్ మున్సిపాలిటీలో 1,344 మంది, కోస్గి మండలంలో 5,403, మద్దూర్ మండలంలో 10,138, దౌల్తాబాద్ మండలంలో 6,681, కొడంగల్లో 4,981, బొంరాస్పేటలో 6,102 మందికి… మొత్తంగా 37,312 మందికి అందుతున్నాయి. రైతు బంధు పథకం కింద కోస్గి, మద్దూర్ పరిధిలో 2018 నుంచి 22 వరకు 39,013 మంది రైతులకు రూ.385కోట్ల పెట్టబడి సాయం అందింది. 2022 సంవత్సరం యాసంగి సీజన్లో బొంరాస్పేట మండలంలో మొత్తం 16,055 మంది రైతులకు రూ.18కోట్లు, దౌల్తాబాద్ మండలంలో 16,846మంది రైతులకు రూ.19కోట్లు, కొడంగల్ మండలంలో 15,903 రైతులకు గాను రూ.20కోట్లు, కోస్గి మండల పరిధిలో 17,480 మంది రైతులకుగాను రూ.19కోట్లు, మద్దూర్ మండల పరిధిలో 20,683 మంది రైతులకు గాను రూ.22కోట్లు మంజూరయ్యాయి. రైతుబీమా పథకం కింద 2018 నుంచి 2022 వరకు కోస్గి మండలంలో 336 మందికి, మద్దూర్ మండలంలో 357మంది రైతుల కుటుంబాలకు రూ.34కోట్ల 65లక్షలను ప్రభుత్వం అందించి ఆదుకున్నది. కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండల పరిధిలో 776 మంది రైతులు మృతి చెందగా రూ.38కోట్లు రైతుబీమా కింద ఆర్థిక సాయాన్ని అందజేసింది.
రూ.90లక్షలతో గ్రామాల రోడ్లపై బ్రిడ్జిల నిర్మాణం..
కొడంగల్ మండలం పోచమ్మతండా గ్రామ పంచాయతీ పరిధిలోని మైసమ్మతండాకు వెళ్లే దారిలోని వాగుతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడేవి. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరైన రూ.50లక్షలతో బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. చిట్లపల్లి-ఖాజాఅహ్మద్పల్లి గ్రామాల మధ్య వాగుపై వంతెన శిథిలావస్థకు చేరుకోగా రూ.40లక్షలతో మరమ్మతు పనులు చేపడుతున్నారు. కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి గ్రామానికి వెళ్లే దారిలోని వాగుపై వంతెన నిర్మించారు. దౌల్తాబాద్ మండలంలోని అల్లాపూర్ గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.కోటీ40లక్షలు మంజూరయ్యాయి.
విద్యకు ప్రాధాన్యం
విద్యారంగానికి రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. పట్టణ పరిధిలోని బండల ఎల్లమ్మ దేవాలయ సమీపంలో రూ.4కోట్ల 57లక్షలతో పాఠశాల నూతన భవనాన్ని నిర్మించింది. రూ.2కోట్లతో కస్తూర్బాగాంధీ కళాశాల భవనాన్ని నిర్మించిది. మున్సిపల్ పరిధిలోని పాతకొడంగల్ ప్రాతంలో రూ.4కోట్ల20లక్షలతో ట్రైబల్ గురుకుల పాఠశాలను నిర్మించారు. మన ఊరు-మన బడి కింద కొడంగల్ పరిధిలో 19 పాఠశాలలు ఎంపిక కాగా, రూ.34లక్షల 6వేలు మంజూరయ్యాయి. బొంరాస్పేట మండల పరిధిలో 25 పాఠశాలలు ఎంపిక కాగా, రూ.4కోట్ల 4లక్షలు మంజూరయ్యాయి. దౌల్తాబాద్ మండల పరిధిలో 24 పాఠశాలలకు గాను రూ. 5కోట్ల 80లక్షలను ప్రభుత్వం మంజూరు చేయగా, పాఠశాలల్లో సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
నిత్యం కోటీ 90లక్షల లీటర్ల నీటి సరఫరా
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’తో నియోజకవర్గంలోని 220 గ్రామాల్లో నిత్యం కోటీ90లక్షల లీటర్ల తాగునీరు సరఫరా అవుతున్నది. మిషన్ భగీరథ పథకం ఏర్పాటుకు గాను రూ.167కోట్ల అంచనా నిధులతో గ్రిడ్ పనులు జరిగాయి. గ్రామాల్లో ట్యాంకులు, పైప్లైన్లు, ఇంటింటికీ నల్లాల ఏర్పాటు వంటి పనులకు రూ.17కోట్లు ఖర్చయ్యాయి. కొడంగల్ పట్టణ శివారులోని సిద్ధినాంపు ప్రాంతంలో ఏర్పాటైన నీటి శుద్ధి కేంద్రంలో నిత్యం 23 మిలియన్ లీటర్ల నీరు శుద్ధి అవుతున్నది.
కొడంగల్, కోస్గిలో 50 పడకల దవాఖానలు, మద్దూర్లో 30 పడకల దవాఖాన..
కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలందించాలని ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలను కల్పించింది. కొడంగల్ సివిల్ దవాఖానను రూ.5కోట్ల50లక్షలతో 50 పడకల భవనాన్ని నిర్మించింది. రూ. కోటితో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయగా, కిడ్నీ రోగులకు సేవలందుతున్నాయి. శిథిలావస్థకు చేరిన మార్చురీ స్థానంలో రూ.కోటితో కొత్త మార్చురీ భవనం, ఆసుపత్రికి ప్రహరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కోస్గిలో 50 పడకల నూతన ఆసుపత్రి భవనం రూపుదిద్దుకొంటున్నది. మద్దూర్ మండల కేంద్రంలో రూ.4కోట్ల75లక్షలతో 30 పడకల దవాఖాన భవనం ప్రారంభం కాగా, సేవలందుతున్నాయి.
రూ.50 కోట్లతో మున్సిపాలిటీల అభివృద్ధి..
రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్, కోస్గిలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది. కొడంగల్కు రూ.15కోట్లు, కోస్గికి రూ.15కోట్లు మంజూరు చేసి పలు వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం, శ్మశాన వాటికల అభివృద్ధి తదితర పనులను చేపట్టింది. మలి దశలో రెండు మున్సిపాలిటీలకు రూ.20కోట్లు మంజూరు కాగా, అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. దీంతో పాటు రూ.2కోట్ల 50లక్షలతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్, రూ.కోటీ 50లక్షలతో మున్సిపల్ కార్యాలయ భవనాలను నిర్మిస్తున్నారు. రూ.50లక్షలతో గ్రంథాలయ భవన నిర్మాణం పూర్తి కాగా, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. రూ.70 లక్షలతో పార్క్ ఏర్పాటైంది. కోస్గి మున్సిపాలిటీ కార్యాలయ నూతన భవనం ప్రారంభమైంది. కోస్గి మున్సిపల్ పరిధిలో రూ.2కోట్లతో బస్డిపో ఏర్పాటైంది. పట్టణ ప్రగతి కింద రూ.60లక్షలతో మినీ ఫుడ్జోన్ నిర్మాణం, రూ.కోటితో కోస్గి బస్టాండ్ నిర్మాణం, రూ.60 లక్షలతో పంచతంత్ర పార్క్ నిర్మాణాలు పూర్తయ్యాయి.
రూ.39 కోట్లతో ‘మిషన్ కాకతీయ’.. రూ.9 కోట్లతో చెక్ డ్యాంలు
‘మిషన్ కాకతీయ’తో చెరువులు, కుంటలకు పూర్వ వైభవం వచ్చింది. కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాల పరిధిలో రూ.39కోట్లతో 140 చెరువులు, కుంటల్లో పూడిక తీశారు. దీంతో నీటి నీల్వ సామర్థ్యం పెరిగి ఆయకట్టు కింద సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రస్తుతం కొడంగల్లో 4708 ఎకరాలు, బొంరాస్పేటలో 12,979 ఎకరాలు, దౌల్తాబాద్లో 8,738 ఎకరాలు, కోస్గి మండలంలో 16వేల ఎకరాలు, మద్దూర్ మండలంలో 14వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. కొడంగల్ పెద్ద చెరువు సుందరీకరణకు రూ.కోటీ60లక్షలు మంజూరయ్యాయి. దౌల్తాబాద్ మండలంలోని చెరువును రూ.7కోట్ల50లక్షలతో మినీ ట్యాంక్బండ్గా తీర్చిదిద్దారు. బొంరాస్పేట మండల పరిధిలో బొంరాస్పేట, తుంకిమెట్ల, మహంతిపూర్ గ్రామాల్లో చెక్ డ్యాంలను నిర్మించారు. కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంతో నియోజకవర్గ పరిధిలో మొత్తంగా లక్షా20వేల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా కాల్వ నిర్మాణానికి త్వరలో టెండర్ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
నూతన మండలాల ఏర్పాటు..
పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. బొంరాస్పేట మండల పరిధిలో దుద్యాల, నియోజకవర్గంలోని నారాయణపేట జిల్లా పరిధి కోస్గి మండలంలోని కొత్తపల్లి, గుండుమాల్ గ్రామాలు కొత్త మండలాలుగా ఏర్పాటయ్యాయి. దుద్యాల, గౌరారం, చిల్ముల్మైల్వార్, నాస్కాన్పల్లి, అల్లిఖాన్పల్లి, ఈర్లపల్లి, లగచెర్ల, పోలెపల్లి, హకీంపేట, కుదురుమల్ల, ఆలేడ్, సండ్రకుంట తండా, సాగరంతండా, సత్కర్కుంటతండా, ఎక్కచెరువుతండా, చెట్టుమీదితండాలు దుద్యాల మండల పరిధిలో ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాలు, పోలీస్స్టేషన్లు, పీహెచ్సీలు ఏర్పాటయ్యాయి.
పల్లెల్లో మెరుగైన మౌలిక వసతులు..
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయి. మున్సిపాలిటీలు, గ్రామాల్లో పట్టణ, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్లు, వైకుంఠధామాలు, కంపోస్టు షెడ్ల నిర్మాణాలతో స్వచ్ఛత ఏర్పడింది. దాదాపు రూ.400 కోట్లతో పల్లెలకు లింక్ రోడ్లు వేశారు. పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యతనిస్తున్నారు.
పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు..
కొడంగల్ పరిధిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. త్వరలో ఖాళీ స్థలం ఉన్నవారికి ‘గృహలక్ష్మి’ కింద రూ.3లక్షలను ప్రభుత్వం అందించనున్నది.