Bus Driver : పశ్చిమబెంగాల్ (West Bengal) లో బస్సు డ్రైవర్ ఇంట్లో (Bus Driver) పెద్దఎత్తున నోట్ల కట్టలు (Currency notes), బంగారం బిస్కెట్లు (Golden Biscuits) బయటపడ్డాయి. ఇసుక, క్వారీ మాఫియా (Sand, Quarry) పై దర్యాప్తులో భాగంగా చేపట్టిన సోదాల్లో ఈ సొమ్మును పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు రూ.5.5 కోట్ల నగదు, 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బీర్భూమ్ జిల్లాకు చెందిన మీనా మండల్ నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఇసుక మాఫియాపై దర్యాప్తులో భాగంగా పక్కా సమాచారంతో ఈ సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే అతడి ఇంట్లో భారీగా అక్రమ నగదు బయటపడింది. స్థానికంగా ఇసుక, క్వారీ మాఫియా డాన్గా పేర్కొనే తులు మండల్కు.. మీనా మండల్ సమీప బంధువు. గతంలో బెంగాల్ ప్రభుత్వంలో బస్సు డ్రైవర్గా పనిచేసిన మీనా.. ఆ తర్వాత ఉద్యోగం మానేసి క్వారీ వ్యాపారం మొదలుపెట్టాడని పోలీసులు తెలిపారు.
డబ్బు, బంగారంతోపాటు మీనా పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఈ సంపద ఎలా వచ్చిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్పై బెంగాల్ సీఎం సువేందు అధికారి ఎక్స్ వేదికగా స్పందించారు. పక్కా సమాచారంతో చేపట్టిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని తెలిపారు. పోలీసులను అభినందించారు. ప్రజల సొమ్మును కొల్లగొట్టేవారిని ఎన్నటికీ వదిలిపెట్టబోమని, అవినీతికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
కాగా బీర్భూమ్లో దాదాపు 250 క్వారీలు అక్రమంగా నడుస్తున్నాయని, అవన్నీ తులు మండల్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని పోలీసులు గుర్తించారు.