అధికారుల సమావేశంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ తిరుపతిరావు
షాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమణికంగా నిలిచిందని, రైతును రాజు చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ద్వారా రైతులు పండించిన వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలుపై పౌర సరఫరాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో వానకాలంలో లక్షా 70వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా. అందుకు తగినట్లుగా అవసరమైన గన్ని బ్యాగులను సిద్ధంగా ఉంచాలని, జిల్లాలో 38ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
వరి ధాన్యం కనీస మద్ధతు ధర క్వింటాలకు గ్రేడ్-ఏ రకానికి రూ. 1960, సాధారణ రకానికి రూ. 1940 లభిస్తుందని తెలిపారు. ఈ ధర లభించాలంటే రైతులు పలు జాగ్రత్తలు వహించాలన్నారు. ధాన్యం అమ్మకానికి తెచ్చే ముందు తాలు గింజలు, కల్తీ గింజలు, పొల్లు లేకుండా తెచ్చినట్లయితే ఆశించిన ధర లభిస్తుందన్నారు. తేమ శాతం ఖచ్చితంగా 17 శాతం లోపు ఉండేటట్లుగా చేసి మీ టోకెన్ ప్రకారం కేటాయించిన రోజు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. ధాన్యం తూకం వేసిన తర్వాత రైతులు విధిగా కొనుగోలు రశీదు పొందాలన్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించే సమయంలో మీ ఫోన్కు ఓటీపీ నంబర్ వస్తుంది కావున తప్పక తమ ఫోన్ను వెంట తీసుకురావాలని సూచించారు. రైతులు తమ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్తో తప్పకుండా అనుసంధానం చేసుకోవాలన్నారు.
ఆధార్కార్డు, పట్టదారు పాసు పుస్తకం, బ్యాంకు ఖాతా నంబర్, జిల్లా కలెక్టర్చే నియమించబడిన అధికారి ధ్రువీకరణ పత్రం తప్పక జతచేయాలని సూచించారు. బ్యాంకు ఖాతా పని చేస్తున్నట్లుగా బ్యాంకు అధికారుల నుంచి ధ్రువీకరించు కోవాలని తెలిపారు. అనంతరం ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్స్ను విడుదల చేశారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మనోహర్రాథోడ్, శ్యామాలక్ష్మి, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి దాత్రిదేవి, టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ ఇర్ఫాన్, కొనుగోలు కేంద్రాల అసోసియేషన్స్ చైర్మన్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.