ఉమ్మడి జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు కాసుల పంట పండింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో ఏకంగా రూ.3415 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.900.61 కోట్ల రెవెన్యూ సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో నెల గడువున్నందున ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరో రూ.300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 2,19,035 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. పారిశ్రామికాభివృద్ధి, రీజినల్ రింగ్రోడ్డు, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా బీజాపూర్ జాతీయ రహదారిని విస్తరించడం, మోమిన్పేట్లో 1200 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తుండడంతో భారీగా లేఅవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు చాలావరకు శంకర్పల్లి, మొయినాబాద్, వికారాబాద్ వరకు నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతుండడంతో వ్యవసాయ భూములతోపాటు వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి.
వికారాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం కాసుల పంట పండింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో ఇప్పటివరకు రూ.3415 కోట్ల ఆదాయం జిల్లా స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ల శాఖ ఖజానాకు చేరింది. అత్యధికంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారానే అధిక ఆదాయం సమకూరింది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో నెల గడువున్న దృష్ట్యా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లతో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెవెన్యూ పెరుగుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో రిజిస్ట్రేషన్లు పుంజుకునే అవకాశాలున్న దృష్ట్యా మార్చి నెలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.300 కోట్ల వరకు రెవెన్యూ వచ్చే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వేగంగా పారిశ్రామికాభివృద్ధి, రీజినల్ రింగ్రోడ్డు, అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రోడ్డుగా బీజాపూర్ జాతీయ రహదారిని విస్తరించడం, మోమిన్పేట్లో 1200 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేస్తుండడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీగా లే అవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు చాలా వరకు శంకర్పల్లి, మొయినాబాద్, వికారాబాద్ వరకు నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతుండడంతో వ్యవసాయ భూములతోపాటు వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలు పెరిగాయి.
రూ.3,415 కోట్ల ఆదాయం
జిల్లాలోని వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాల ద్వారా జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు రూ.3,415 కోట్ల రెవెన్యూ వచ్చింది. అత్యధికంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.900.61 కోట్ల రాబడి చేకూరింది. జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అత్యధికంగా రెవెన్యూ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం అనంతరం గండిపేట, శేరిలింగంపల్లి, మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధిక రెవెన్యూ ప్రభుత్వ ఖజానాకు చేరింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2,19,035 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 2022-23లో ఇప్పటివరకు 2,19,035 డాక్యుమెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయింది.