కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ మహేందర్రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా 18మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. రెండేళ్లల్లో కేఎల్ఐ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందజేస్తామన్నారు. మండల కేంద్రంలో పోలీసు స్టేషన్, తాసిల్దార్ కార్యాలయాల భవన నిర్మాణ పనులను వారం రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ…
మండల కేంద్రానికి చెందిన బ్రహ్మచారికి రూ. 2లక్షలు, మహేశ్కి రూ.62,500, గాన్గుమార్లతండాకి చెందిన హరిలాల్నాయక్కి రూ. 60వేలు, కిష్టారాంపల్లికి చెందిన బాలుకి రూ. 39వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకందరికీ వరంలా మారిందని తెలిపారు.
ఈ నెల 8న ఏఏంసీ పాలక మండలి ప్రమాణ స్వీకారం..
నూతనంగా ఏర్పాటైన ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకర కార్యక్రమం ఈ నెల 8న ఆమనగల్లులోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా పట్టణంలో నిర్మించిన రైతువేదికను ప్రారంభించి, ఇంటిగ్రెటెడ్ మార్కెట్కి, గ్రంథాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.