తుర్కయాంజల్ : సీఎం కేసీఆర్ దళిత పక్షపాతని, టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే దళితుల అభ్యున్నతి సాధ్యం అవుతుందని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే చొరవతో తుర్కయాంజల్ మున్సిపాలిటీ మునగనూరు సర్కారు కంచె దళిత రైతులకు విముక్తి లభించగా తుర్కయాంజల్ కాశీంగుట్ట ప్లాట్ల దళిత లబ్ధిదారులకు మోక్షం దొరికింది. సర్కారు కంచె రైతులు, కాశీంగుట్ట లబ్ధిదారులతో ఎమ్మెల్యే బుధవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారి, అబ్ధుల్లాపూర్మెట్ మండల తాసీల్దార్ వెంకటేశ్వర్లుతో కలిసి ప్లాట్ల కేటాయింపు స్థలాలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. మునగనూర్ సర్వే నంబర్ 120లోని సర్కారు కంచెలో 67.19 ఎకరాల్లో దళిత రైతులు కబ్జాల్లో ఉండగా ఇందులోంచి 15 ఎకరాలు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల కోసం జీహెచ్ఎంసీకి కేటాయించగా దళితులు కోర్టును ఆశ్రయించడంతో వివాదంలో ఉన్న విషయం తెలిసిందే.
దళిత రైతులు తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని కోరిన నేపథ్యంలో ఆయన అధికారులతో కలిసి నేరుగా రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. కబ్జాలో ఉన్న 20మంది రైతు కుటుంబాలకు గాను ప్రస్తుతం 120మంది అర్హులైన రైతులకు హెచ్ఎండీఏ ద్వారా అభివృద్ధి చేసిన లేఅవుట్లో ఒక్కొక్కరికి 500గజాల ఇంటి స్థలం, డబుల్ బెడ్రూం ఇచ్చేందుకు ఎమ్మెల్యే ఇది వరకే హామీ ఇచ్చారు. కాని రైతులు తమ కుటుంబాలు చాలా పెరిగాయని 600 గజాల ఇంటి స్థలంతో పాటు రెండేసీ చొప్పున డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని ఎమ్మెల్యేను కోరారు. దశాబ్దాలుగా కబ్జాలో ఉంటు సాగు చేసుకుంటున్న దళితులకు న్యాయం చేయాలనే ఒకే ఒక్క కారణంతో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి 20మంది రైతు కుటుంబాలకు 500గజాల ఇంటి స్థలం, డబుల్బెడ్రూం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించందని ఎమ్మెల్యే తెలిపారు. 120 సర్వే నంబర్లో రైతులకు అనూవైన ప్రాంతంలో ఇండ్లు కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
హెచ్ఎండీఏ ద్వారా అభివృద్ధి చేసి అన్ని వసతులు కల్పించిన లేఅవుట్లో రైతులకు ఇంటి స్థలాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. పది రోజుల్లో అధికారులు సర్వే పూర్తి చేసి హద్దురాళ్లు ఏర్పాటు చేస్తే లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంటి స్థలాలు కేటాయిస్తామన్నారు. అలాగే సర్వే నంబర్ 83లో నెలకొన్న దళిత రైతుల సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
లబ్ధిదారుల నిరీక్షణకు మోక్షం…
తుర్కయాంజల్ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 631లో 40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కాషంగుట్ట ప్లాట్ల లబ్ధిదారుల నిరీక్షణకు ఎట్టకేలకు మోక్షం లభించింది. పట్టాలు పొంది ఇంటి నిర్మాణాలకు నోచుకొని లభ్ధిదారులకు ఎమ్మెల్యే పరిష్కారం చూపించారు. రెవెన్యూ అధికారులతో కలిసి గతంలో పట్టాలు పొందిన దళిత లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఖాషంగుట్ట భూముల్లో కబ్జాలో ఉన్న దళిత రైతులకు అప్పట్లో ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించగా ఇంటి నిర్మాణాలు ఉన్న వాటికి మాత్రమే 58జీఓ కింద ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేయగా ఖాళీగా ఉన్న స్థలాల్లో ఇంటి నిర్మాణాలకు అధికారులు అనుమతిని నిరాకరించారు.
దీంతో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు ఎమ్మెల్యే శాశ్వత పరిష్కారం చూపించారు. సర్వే నంబర్ 631లో గతంలో పట్టాలు పొంది ఇంటి నిర్మాణాలు చేసుకొని 140మంది దళిత లబ్ధిదారులు ఇండ్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను కోరగా అనుమతి ఇవ్వటం జరిగిందన్నారు. గతంలో పట్టాలు పొందిన పాత లబ్ధిదారులు అధికారులు సహకరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆర్డీవో సదరు భూమిని దళితుల ఇండ్ల స్థలాల కోసం గతంలో కేటాయించినట్లు నివేదిక తయారు చేసి నిజమైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి 10 రోజుల్లో జిల్లా కలెక్టర్కు అందజేస్తారన్నారు. లబ్ధిదారులు ఒక మిటీగా ఏర్పాటు చేసుకొని నిజమైన లభ్ధిదారుల ఎంపికను చేపట్టి ఎవరికి ఎక్కడ కేటాయించారో నిర్థారించాలని ఆర్డీఓ సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు రాజకీయ లభ్ధికోసమే దళితులు కబ్జాలో ఉన్న భూములను పీఓటి కింద లాక్కున్నారన్నారు. సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న దళిత రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వకుండా గుంజుకున్నారన్నారు. ఎన్నో యేండ్లుగా కేసులు, కోర్టుల చుట్టు తిరుగుతున్న దళిత భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్ధేశంతో సీఎం కేసీఆర్ దళితుల కబ్జాలో ఉన్న భూములకు సత్వర పరిష్కారం చూపించి న్యాయం చేయాలని సంకల్పించారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ కందాడ ముత్యంరెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గుండ్లపల్లి హరితధన్రాజుగౌడ్, టీఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్ నాయక్, కౌన్సిలర్లు వేముల స్వాతి అమరేందర్రెడ్డి, తాళ్లపల్లి సంగీతమోహన్ గుప్తా, కొత్తకుర్మ మంగమ్మశివకుమార్, పుల్లగురం కీర్తన విజయానంద్రెడ్డి, మేతరి అనురాధదర్శన్, గుండా భాగ్యమ్మధన్రాజ్, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి, రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.