రామచంద్రాపురం, జూలై 30: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భెల్ మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. నైజీరియా నుంచి ఎనిమిది గ్యాస్ టర్బైన్ జనరేటర్ల ప్రతిష్ఠాత్మక ఆర్డర్ లభించిందని, దీని విలువ రూ.2,500 కోట్ల స్థాయిలో ఉంటుందని కంపెనీ ఈడీ శ్రీనివాసరావు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన పోటీ మధ్య ఈ ఆర్డర్ దక్కించుకోవడం సంతోషంగా ఉన్నదన్నారు.
ఈ ఆర్డర్లో భాగంగా ఎనిమిది గ్యాస్ టర్బైన్ జనరేటర్ రూపకల్పన, తయారీ, సరఫరాతోపాటు ప్రాజెక్టు కార్యకలాపాలు నిర్వహించాల్సివుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ జనరేటర్ పరికరాలను హైదరాబాద్తోపాటు బెంగళూరులో ఉన్న ప్లాంట్లో తయారు చేస్తున్నట్టు చెప్పారు.