న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాలు, వాణిజ్యం, గ్రీన్కార్డులపై ఆంక్షలు విధించినప్పటికీ భారతీయుల అమెరికా కల చెదిరిపోలేదు. అమెరికాలో విస్తరిస్తున్న ‘లిటిల్ ఇండియా’లే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. 2005లో అమెరికాలో 18 లక్షలుగా ఉన్న భారతీయుల సంఖ్య 2025 నాటికి 50 లక్షలకు చేరింది. ఓ నివేదిక ప్రకారం తెల్లజాతి అమెరికన్ల కంటే భారతీయ కుటుంబాల సంపద రెట్టింపుగా ఉంది. గత 20 ఏండ్లలో అమెరికాలో భారతీయుల జనాభా గణనీయంగా ఉన్న 50కి పైగా ‘లిటిల్ ఇండియా’లు ఏర్పడ్డాయి. వచ్చే ఐదేండ్లలో ఈ సంఖ్య 75కు చేరుకునే అవకాశం ఉంది.
భారతీయ కుటుంబాల సగటు ఆదాయం సుమారు రూ.1.54 కోట్లు కాగా, తెల్లజాతి అమెరికన్ కుటుంబాల సగటు ఆదాయం దాదాపు రూ.80 లక్షలుగా ఉంది. ఈ ఆదాయ అంతరం రాబోయే ఏండ్లలో మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. కరోలినా, కాలిఫోర్నియా, న్యూజెర్సీల్లో మొత్తంగా 50 ‘లిటిల్ ఇండియా’లు ఉన్నాయి. మరో 25 లిటిల్ ఇండియాలు జార్జియా, అరిజోనా, వర్జీనియా, సియాటిల్, షికాగోలో ఏర్పడే అవకాశం ఉంది. భారతీయుల ఉనికి అమెరికా ఆర్థిక నమూనాతో నేరుగా ముడిపడి ఉందని బ్రూకింగ్ ఇన్స్టిట్యూషన్కు చెందిన విలియం ఫ్రే పేర్కొన్నారు. భారతీయులు 25 ఏండ్ల క్రితం సిలికాన్ వ్యాలీలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారని, ప్రస్తుతం టెక్నాలజీ కేంద్రానికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నారని తెలిపారు.