శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలుగా తిష్టవేసిన సమస్యల పరిష్కారినికై శుభోదయం కార్యక్రమాన్ని నిర్విహిస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఆలాంఖాన్గూడ, దాని అనుబంధ గ్రామమైన చిన్నారెడ్డి గూడెంలో ఉదయం 7గం.ల నుంచి శుభోదయం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో సుమారు 25 సంవత్సరాలుగా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయని వాటిని దశల వారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కొరకై పల్లెప్రగతి పథకాన్ని ప్రవేశ పెట్టారని చెప్పారు. ఈ పథకంలో గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారి పచ్చదనాన్ని సంతరించుకున్నాయని తెలిపారు. కాగా ఎమ్మెల్యే గ్రామంలో గడపగడపకు తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వృద్ధాప్య పింఛన్లు, రైతుబంధు రూపాయలు సకాలంలో అందుతున్నాయా లేవా అని రైతులను, వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. ఆలాంఖాన్గూడ గ్రామంలో కొన్ని వీధుల్లో సీసీరోడ్లు, అండర్ డ్రైనేజీ మురికి కాలువలు నిర్మించాలని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. చిన్నారెడ్డి గూడెంలో కొన్ని వార్డులో నీటి సమస్యలు ఉన్నాయని అందుకు చిన్న ట్యాంకులను నిర్మించాలని మహిళలు కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, గ్రామ సర్పంచ్ మౌనిక నరేందర్రెడ్డి, మండల, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్, వాసుదేవ్కన్నాలు, ఉపాధ్యక్షుడు రాఘవేందర్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, యువజన టీఆర్ఎస్ అధ్యక్షడు ఇంద్రసేనారెడ్డి, నాయకులు సాత ప్రవీణ్కుమార్, సీహెచ్ గోపాల్రెడ్డి, నరేందర్రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.