ఇబ్రహీంపట్నం : పోడుభూముల సమస్యకు త్వరలో పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అన్నిపార్టీల నాయకులు సహకరించాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం శేరిగూడ సమీపంలోని ఫంక్షన్హాల్లో నియోజకవర్గంలోని పోడు భూముల సమస్యలపై అధికారులు, అఖిలపక్షం నాయకులతో ఎమ్మెల్యే అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్, సీపీఎం, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన నాయకులు హాజరై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని పోడు భూముల సమస్యలు ఉన్నట్లుగా ఎనిమిది గ్రామాలను అధికారులు గుర్తించారని ఇందులో రంగాపూర్, తిప్పాయిగూడ, తాళ్లపల్లిగూడ, సాహెబ్నగర్, పోల్కంపల్లి, కుత్బుల్లాపూర్, తట్టిఅన్నారం గ్రామాలు ఉన్నాయని, ఈ గ్రామాల్లో 670 ఎకరాలకు సంబంధించి 712 మంది రైతులను అధికారులు గుర్తించారన్నారు.
ఈ గ్రామాలే కాకుండా ఇంకా ఇతర గ్రామాల్లో పోడుభూములకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా అఖిలపక్ష నాయకులు సూచనలు, సలహాలిస్తే వాటి పరిష్కారానికి కూడా ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. ముఖ్యంగా గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో అందరి సమక్షంలో పోడు భూముల్లో పట్టలు పొందిన రైతుల జాబితాను తయారు చేస్తారని, అలాగే, అనుభవిస్తున్న రైతుల జాబితాను కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా తయారు చేస్తారన్నారు. గ్రామ స్థాయిలో నిర్వహించే గ్రామ సభకు ఎంపీడీవో, తాసిల్దార్, అటవీశాఖ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఉంటారని తెలిపారు. వాస్తవ పరిస్థితిని అందరి సమక్షంలో తెలుసుకున్న తరువాత ఈ జాబితా తయారు చేస్తారన్నారు. ఈ విధానం ద్వారా నిజమైన లబ్ధిదారులకు, అనుభవదారులకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఎన్నో ఏండ్లుగా గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందినవారు పోడు భూముల సమస్యతో సతమతమవుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని పోడుభూముల సాగు రైతులకు న్యాయం చేయడానికి ముందుకొచ్చారన్నారు. ముఖ్యంగా అటవీశాఖ అధికారులు తమ సరిహద్దులను గుర్తించుకోవాలని, అలాగే, అటవీ ప్రాంతాల మధ్య నుంచి వెళ్తున్న రోడ్ల సమస్య కూడా ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉందని, ఈ సమస్య కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్డీఓ వెంకటాచారి, ఫారెస్టు రేంజ్ అధికారి విష్ణువర్ధన్లు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇంకా మిగిలిన గ్రామాల్లో పోడుభూముల సమస్యలను అఖిలపక్ష నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటి పరిష్కారం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెల్తామన్నారు. ముఖ్యంగా గ్రామ సభల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా వాస్తవ పరిస్థితులను గుర్తించి లబ్ధిదారుల ఎంపిక చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయిలో ఎంపిక చేసిన జాబితాపై ఎవరికైనా అనుమానాలుంటే మండలస్థాయి లేదా, జిల్లా స్థాయి కమిటీకి ఫిర్యాదు చేసుకోవచ్చునని అన్నారు.
అలాగే ఇబ్రహీంపట్నం మండలంలోని నాగన్పల్లిలో ఉన్న 74 ఎకరాల్లో 30మంది రైతులు ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్నారని, వారికి కూడా న్యాయం జరుగాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో నిర్వహించే గ్రామ సభకు ఉన్నతాధికారులు వెల్లి నిజమైన రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు సుకన్య, నర్మద, జడ్పీటీసీ దాసుగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్లు కప్పరి స్రవంతి, కొత్త ఆర్తిక, చెవుల స్వప్న, మాజీ ఎమ్మెల్యే రాములు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, నాయకులు చక్రపాణి, తాసిల్దార్లు అనిత, వెంకటేశ్వర్లు, ఎంపీడీవోలు మహేష్బాబు, శ్రీనివాస్తో పాటు అటవీ రెవెన్యూ శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.