వికారాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి ఫలితాల్లో జిల్లా 31వ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన రిజల్ట్స్లో జిల్లా ఈ ఏడాది కూడా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది. వరుసగా నాలుగో ఏటా కూడా చివరి స్థానంలోనే నిలిచింది. అయితే గతేడాదితో పోలిస్తే మెరుగైన ఫలితాలు వచ్చాయి. గతేడాది 33వ స్థానంలో నిలిచిన జిల్లా, ఈ ఏడాది 31వ స్థానంలో ఉన్నది. గతేడాది 73 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ ఏడాది ఫలితాల్లో 91.25 శాతం సాధించింది. జిల్లాలో 13,482 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకాగా 12,302 మంది స్టూడెంట్స్ ఉత్తీర్ణులయ్యారు.
మరోవైపు ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. జిల్లా లో 6,729 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 5,955 మంది ఉత్తీర్ణులుకాగా, బాలికలకు సంబంధించి 6,753 మం ది పరీక్షలకు హాజరుకాగా 6,347 మంది పాస్ అయ్యారు. బాలికలు 93.99%, బాలురు 88.5% మంది ఉత్తీర్ణులయ్యారు. జూన్ 5 నుంచి 12 వరకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు ఫీజు చెల్లింపునకు మే 14 వరకు గడువు ఇచ్చారు. మార్కుల రీ కౌంటింగ్, ఈ-వెరిఫికేషన్కు రేపటి నుంచి మే 14 వరకు ప్రభుత్వం గడువిచ్చింది.
టెన్త్ ఫలితాల్లో సీఎం సొంత జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఫలితాల్లో జిల్లా వెనుకబడిందనే విమర్శలున్నాయి. వరుసగా మూడేండ్లు 33వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 31వ స్థానంతో సరిపెట్టుకున్నది. ప్రతి ఏటా టెన్త్ ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతోనే మెరుగైన ఫలితాలను సాధించలేకపోతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గతేడాది కంటే ఉత్తీర్ణతాశాతం 15 శాతం మేర పెరిగిందని చెప్పుకోవడం తప్ప అధికారులు పెద్దగా చేసేదేమీ లేదనే అభిప్రాయమూ వ్యక్తమవుతున్నది. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్లలో డిసెంబర్ నుంచచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఫలితాలను మాత్రం రాబట్టలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై మొదటి నుంచి దృష్టి సారించకుండా కేవలం పరీక్షల సమయంలోనే ఉత్తీర్ణుల్యేలా వారిపై ఒత్తిడి తీసుకొచ్చారని జిల్లా విద్యాశాఖ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.