షాబాద్, ఫిబ్రవరి 15: ఆశ కార్యకర్తలకు మరింత పకడ్బందీగా ఆరోగ్యసేవలు అందించాలనే ఉద్దేశంతో వారికి ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నదని కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయన ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ఆన్లైన్ సేవలు అందించడానికి స్మార్ట్ ఫోన్లు ఉపయోగించాలని సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఆశ కార్యకర్తలు తమ పరిధిలో సర్వే చేసే ప్రభలుతున్న వ్యాధులను గుర్తించి రోగుల వివరాలు ఆన్లైన్ చేయాలన్నారు. తద్వారా సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులకు ఆ వివరాలను పంపించడమే కాకుండా, పీహెచ్సీ వైద్యాధికారి దగ్గరకు రోగులను తరలించి తగు చికిత్సలు అందేవిధంగా చూడాలన్నారు. క్యాన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు, కుష్టు, క్షయ వంటి వ్యాధుల సర్వే, స్క్రీనింగ్ ప్రక్రియల ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఆశ నోడల్ సూపర్ వైజర్ల ద్వారా అన్ని పీహెచ్సీలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు.
ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమానికి సిద్ధం కావాలని సంబంధిత అధికారులకు రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని కోర్టుహాల్లో హరితహారం కార్యక్రమంపై అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2022-23లో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. ఆయా శాఖలకు కేటాయించే లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలను నాటాలని, రోడ్లకు ఇరువైపులా ఎత్తైన అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ స్థలాలు, అంగన్వాడీ కేంద్రాల ఆవరణల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. అటవీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆరు నెలల పాటు మొక్కలు కాపాడుకోగలిగితే అవి సంరక్షించబడుతాయన్నారు. ఇదివరకే నాటిన మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేసి ఎండిపోకుండా నిత్యం నీరు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా అటవీశాఖ అధికారి జానకిరామ్, సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి, పరిశ్రమల అధికారి రాజేశ్వర్రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి రామేశ్వరి, సివిల్ సప్లయ్ అధికారి మనోహర్రాథోడ్, డీఆర్డీవో ప్రభాకర్, అబ్కారీ శాఖ సూపరింటెండెంట్స్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.