Tej Pratap Yadav : జన్శక్తి జనతాదళ్ పార్టీ (JJP) అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ (Tejpratap Yadav) అరెస్టయ్యారు. బీహార్ పోలీసులు (Bihar Police) ఆయనను అరెస్టు చేశారు. ఆయనను పట్నా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (Patna Judicial Magistrate) ముందు హాజరుపర్చగా.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం అధికారులు బేవూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. నీట్ పేపర్ లీకేజీ (NEET Paper leakage) ఉదంతం, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యలను నిరసిస్తూ ప్రతిపక్షాలు, పలు సామాజిక సంస్థలు శనివారం బీహార్ బంద్కు పిలుపునిచ్చాయి.
ఈ సందర్భంగా పట్నాలో వేలాది మంది విద్యార్థులు, యువకులు రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు ట్రాఫిక్ సిగ్నల్స్ను పగులగొట్టారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పట్నాలోని రామ్ గులాం చౌక్ వద్ద నిరసనలో పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, తమ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
అనంతరం సాయంత్రం సమయంలో దక్ బంగ్లా చౌరస్తా వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తేజ్ ప్రతాప్ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదివారం కోర్టుకు సెలవు కావడంతో సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు.