యాచారం, డిసెంబర్19: ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఎకరాకు 121 గజాల ఇళ్ల స్థలాలను జనవరిలో ఇవ్వనున్నట్లు ఆర్డీవో వెంకటాచారి తెలిపారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ప్రతి ఎకరాకు 121 గజాల ఇళ్ల స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వనుందని ఆయన పేర్కొన్నారు. దీనికోసం కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో హెచ్ఎండీఏ వెంచర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే భూసేకరణతో పాటు లే-అవుట్ ప్రణాళికలను అధికారులు రూపొందించారన్నారు. మొత్తం 7645 ఎకరాల భూమికి ఎకరాకు 121 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులో 3444 ఎకరాల పట్టా, 3701 ఎకరాల అసైన్డ్ భూములున్నట్లు తెలిపారు. 1996 ఎకరాల భూమికి సంబంధించి కోర్టు కేసులున్నాయన్నారు. కోర్టు కేసులున్న భూములకు మినహాయించి సేకరించిన భూములను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం ఏర్పాటు చేస్తున్న వెంచర్లో పార్కు, విశాలమైన రోడ్లు, విద్యుత్, విద్య, వైద్యం, తాగునీరు తదితర సౌకర్యాలను కల్పిస్తామన్నారు.
ఇప్పటికే అసైన్డ్, పట్టా భూములు ఇచ్చిన రైతులు ఆధార్ కార్డు, 3పాస్పోర్టు సైజ్ ఫొటోలను సంబంధిత రెవెన్యూ అధికారులకు వారం రోజుల్లోగా అందజేయాలని ఆయన సూచించారు. రైతులు అధైర్య పడొద్దని, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేస్తుందన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు మేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. డబుల్రోడ్డు విస్తరణకు 45 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఫార్మాసిటీలో ఇంటికో ఉద్యోగంలో భాగంగా 450 మంది యువతీ యువకులకు శిక్షణనిచ్చినట్లు తెలిపారు. త్వరలో చేపట్టే ఫార్మా పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో తహసీల్దార్ సుచరిత, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్కుమార్ తదితరులున్నారు.