వికారాబాద్, నవంబర్ 30, (నమస్తే తెలంగాణ) : ఎనిమిదేండ్లుగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వికారాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నియోజకవర్గాల ప్రగతి, గడప గడపకూ అందుతున్న ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించనున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, రోహిత్రెడ్డి, మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రతి పది గ్రామాలకో సమ్మేళనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. వారం రోజుల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతోపాటు సలహాలు తీసుకోనున్నారు. ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి రానుండడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనాలతో పార్టీ కార్యకర్తల్లో మరింత నూతనోత్సాహం రానున్నది.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ పది గ్రామాలకు ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. సంక్షేమ పథకాలతోపాటు ఎనిమిదేండ్లలో చేసిన అభివృద్ధిని వివరించి, ప్రజాభిప్రాయాలను సేకరించనున్నారు. పరిగి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించనుండగా, వికారాబాద్ నియోజకవర్గంలో కోట్పల్లి మండలం నుంచి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ షురూ చేయనున్నారు. కొడంగల్, తాండూరు నియోజకవర్గాల్లో డిసెంబర్ రెండో వారంలో ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిలు ఆత్మీయ సమ్మేళనాల కోసం ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు త్వరలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలతో టీఆర్ఎస్లో నూతనోత్సాహం రానున్నది. ప్రజల్లోకి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు..
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం సబ్బండ వర్గాల సంక్షేమానికై ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. గతంలో ఎన్నడూలేని విధంగా పేద ప్రజలు, రైతుల సంక్షేమం కోసం సరికొత్త పథకాలను అమలు చేస్తుండడంతో దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తున్నది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ప్రతీ పేదోడు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు వందకుపైగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా అమలు చేస్తున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకిచ్చిన హామీ మేరకు రూ.లక్ష రుణాన్ని నాలుగు విడుతల్లో మాఫీ చేసింది. రైతును రాజుగా చేసేందుకుగాను పంట పెట్టుబడి నిమిత్తం ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయమందిస్తున్నారు.
రైతుబీమా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రూ.5 లక్షల ఇన్సూరెన్స్ను మృతి చెందిన రైతు కుటుంబాలకు అందిస్తున్నది. ఏ ఆసరా లేని వారికి అండగా నిలుస్తూ పింఛన్లను ఇస్తున్నది. గతంలో ఇచ్చిన రూ.200ల పింఛన్ను నుంచి 2016లకు, రూ.500ల నుంచి రూ.3016లకు పెంచారు. కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావడంతోపాటు రైతులు అప్పుల బారి నుంచి విముక్తి కలిగించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. గొల్ల, కుర్మలకు సబ్సిడీతో గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పిల్లల పంపిణీ, బీసీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకుగాను బ్యాంకులతో సంబంధం లేకుండా సబ్సిడీ రుణాలు, ఎస్సీలకు పూర్తి సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నది.
మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నది. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలకు పూర్వ వైభవం వచ్చింది. రోడ్లకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి జిల్లాలోని రోడ్లకు సుమారు రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులను విడుదల చేసింది. గతంలో మెజార్టీ గ్రామాలకు రహదారులుండేవి కావు, వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుండేవారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రతీ గ్రామానికి రోడ్లను ఏర్పాటు చేయడంతోపాటు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి లింక్ రోడ్లను నిర్మించింది. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. పేద ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకువచ్చి రూ.లక్షా116 సాయాన్ని అందిస్తున్నది.
పరిగి మండలం నుంచి ప్రారంభిస్తాం..
డిసెంబర్ 6 నుంచి పరిగి మండలం నుంచి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రతీ పది గ్రామాలకు ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేలా పరిగి మండలంలో డిసెంబర్ 6, 9, 11 తేదీల్లో నిర్వహిస్తాం. దేశంలో ఎక్కడాలేని విధంగా అన్ని వర్గాల సంక్షేమానికై టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నది, సంబంధిత సంక్షేమ, అభివృద్ధి పథకాలన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్తాం.
– కొప్పుల మహేశ్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే
కోట్పల్లి మండలం నుంచి…
వికారాబాద్ నియోజకవర్గంలో కోట్పల్లి మండలం నుంచి ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. అట్టడుగు వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకుగాను సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తూ వారికి నచ్చిన వ్యాపారాలు చేసుకునేందుకు రూ.10 లక్షల సాయమందిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకాలన్నింటిని ఆత్మీయ సమ్మేళనాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం.
– మెతుకు ఆనంద్, వికారాబాద్ ఎమ్మెల్యే