రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. జిల్లా హైదరాబాద్కు ఆనుకొని ఉండడం.. పరిశ్రమల నిర్వహణకు అవసరమైన వనరులు, మెరుగైన రవాణా సౌకర్యం ఉండడంతో ఇక్కడ తమ పరిశ్రమలను నెలకొల్పేందుకు బహుళజాతి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే పలు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకాగా పెద్ద ఎత్తున ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతవుతున్నాయి. ఎక్స్పోర్ట్స్లో జిల్లా కీలక భూమిక పోషిస్తున్నది. గచ్చిబౌలి, ఆదిబట్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఐటీ సెజ్లను ప్రభుత్వం అభివృద్ధిలోకి తీసుకురావడంతో ఐటీ ఎగుమతుల్లో కొన్నేండ్లుగా రంగారెడ్డి జిల్లానే టాప్లో నిలుస్తున్నది. ప్లాస్టిక్ మొదలుకొని ఏరోస్పేస్-డిఫెన్స్కు సంబంధించిన ఉత్పత్తుల వరకూ అమెరికా, బ్రిటన్, చైనా, కెనడా తదితర దేశాలకు జిల్లా నుంచే ఎగుమతవుతున్నాయి. జిల్లా నుంచి ప్రతి నెలా సగటున రూ.847 కోట్ల విలువైన ఉత్పత్తులను ఇతర దేశాలకు తరలిస్తున్నారు. మరోవైపు వాణిజ్య ఉత్సవ్లో భాగంగా దేశవ్యాప్తంగా 100 జిల్లాలను కేంద్రం ఎంపిక చేయగా.. అందులో మన జిల్లాకు చోటు దక్కడం గమనార్హం.
-రంగారెడ్డి, మార్చి 3, (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, మార్చి 3 : పారిశ్రామికరంగ అభివృద్ధిలో రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా కీలకపాత్ర పోషిస్తున్నది. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉండడంతోపాటు పరిశ్రమలను నెలకొల్పేందుకు జిల్లా అనువైన ప్రాంతంగా మారింది. పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెట్లకు సులువుగా తరలించడం, అంతేకాకుండా పారిశ్రామికరంగాభివృద్ధికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలైన భూములు, రోడ్లు, రైలు సౌకర్యం, 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితరాలుండడంతో రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రముఖ దిగ్గజ సంస్థలన్నీ క్యూ కడుతున్నాయి.
జిల్లాలోని 36 ఇండస్ట్రియల్ పార్కుల్లోని పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువులను ఎగుమతి చేయడంలోనూ జిల్లా కీలక భూమిక పోషిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని గచ్చిబౌలి, ఆదిబట్ల, మహేశ్వరం, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఐటీ సెజ్లను అభివృద్ధిలోకి తీసుకురావడంతో ప్రధానంగా ఐటీ ఎగుమతుల్లో రంగారెడ్డి జిల్లానే గత కొన్నేండ్లుగా టాప్లో నిలుస్తున్నది. రంగారెడ్డి జిల్లా నుంచి ప్లాస్టిక్ మొదలుకొని ఏరోస్పేస్-డిఫెన్స్కు సంబంధించిన ఉత్పత్తుల వరకు అమెరికా, బ్రిటన్, చైనా, కెనడా తదితర దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. మరోవైపు ‘వాణిజ్య ఉత్సవ్’లో దేశవ్యాప్తంగా 100 జిల్లాలను కేంద్రం ఎంపిక చేసింది. ఎగుమతుల్లో టాప్లో ఉన్న రంగారెడ్డి జిల్లాకు వాణిజ్య ఉత్సవ్లో చోటు దక్కడం గమనార్హం.
జిల్లా నుంచి నెలకు సగటున రూ.847 కోట్ల విలువైన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. జిల్లా నుంచి మాంసం, బియ్యం, మామిడి, బల్క్ డ్రగ్స్, ఏరోస్పేస్-డిఫెన్స్కు సంబంధించిన భాగాలు, సోలార్ మాడ్యూల్స్, ఇంజినీరింగ్ కాంపోనెంట్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, కుదుళ్లు, రెడీమేడ్ దుస్తులు, ఐటీకి సంబంధించిన ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్ పరిశ్రమలకు సంబంధించి 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.96,605 కోట్ల ఎగుమతులు జరుగడం గమనార్హం.
ఎగుమతులకు సంబంధించి ఏరోస్పేస్-డిఫెన్స్ పరిశ్రమలు 20 ఉండగా 11 ఎగుమతి యూనిట్స్, వ్యవసాయ ఉత్పత్తి పరిశ్రమలతోపాటు కోల్డ్ స్టోరేజీలు 375కు 5, 18 ఆటోమొబైల్ పరిశ్రమలకు 2, 201 ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ పరిశ్రమలకు 6, టెక్స్టైల్స్కు సంబంధించి 168 పరిశ్రమలకు, 2, ఇంజినీరింగ్, ప్లాస్టిక్, రబ్బర్, సోలార్, ఫార్మా, పేపర్, ఫుడ్ ప్రాసెసింగ్కు సంబంధించి 4419 పరిశ్రమలుండగా 83 ఎగుమతి యూనిట్లు జిల్లాలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మూడు జాతీయ రహదారులకు అనుసంధానం, అంతర్జాతీయ విమానాశ్రయం, దేశంలో ఎక్కడికైనా జిల్లా నుంచి రైల్వే సౌకర్యంపాటు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో పరిశ్రమలకు సరిపడా నీటి సరఫరా, ఆయా పరిశ్రమల్లో పనిచేసేందుకు అవసరమయ్యే మానవశక్తి, అత్యుత్తమ ప్రొఫెషనల్స్ను తీర్చిదిద్దే ఐఎస్బీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐఐటీ హైదరాబాద్, ఎన్ఐఆర్డీతోపాటు హార్డ్వేర్, ఐటీ, డిఫెన్స్, ఫార్మా ఇండస్ట్రియల్ పార్కులు ఉండడంతో రంగారెడ్డి జిల్లా ఎగుమతులకు హబ్గా మారింది.