వానకాలం సీజన్కు సంబంధించి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. గతేడాది 3,43,001 ఎకరాల్లో పంటలు సాగుకాగా, ఈ ఏడాది జిల్లాలో 4,39,631 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నట్లు అంచనా వేసింది. గత ఏడాది కంటే ఈ వానకాలంలో 96,630 ఎకరాలు అదనంగా సాగు అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. అందుకు తగ్గట్లుగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకుగాను అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కల్తీ విత్తనాలు, ఎరువుల విషయంలో రాష్ట్ర సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫెర్టిలైజర్ షాపులను తనిఖీలు చేస్తూ ఎలాంటి అవకతవకలు జరుగకుండా జిల్లాయంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. అన్నదాతలను ఇబ్బందికి గురి చేయవద్దని ఫెర్టిలైజర్ నిర్వాహకులకు సలహాలు, సూచిస్తున్నది. జిల్లాలో అధికంగా పత్తి, వరి, మొక్కజొన్న, కందులు సాగవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
– రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, మే 23 (నమస్తే తెలంగాణ): రైతును రాజుగా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ఇందుకోసం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ప్రభుత్వ విధానాలతో వ్యవసాయం పండుగలా మారింది. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, అందుబాటులో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు పథకం ద్వారా ఏటా ప్రతి ఎకరానికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం, రైతుబీమా వంటి పథకాల అమలుతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం వానకాలం పంటల సాగు జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలు దాటనున్నది. గతేడాది 3,43,001 ఎకరాల్లో పలు రకాల పంటలు సాగు కాగా.. ఈ ఏడాది 4,39,631 ఎకరా ల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నట్లు అధికారులు అం చనా వేశారు.
గతేడాదితో పోల్చితే ఈ ఏటా 96,630 ఎకరాల్లో వివిధ రకాల పంటలు అదనంగా సాగు కానున్నట్లు ప్రణాళికను ఖరారు చేశారు. కాగా పత్తి, కంది పంటల సాగును పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడా ది వానకాలంలో వరి 87,000 ఎకరాలు, జొన్న 17,000, మొక్కజొన్న 90,000, పెసర్లు 500, కందు లు 31,000, పత్తి 1,99,000, మినుములు 37, వేరుశనగ 60, ఆముదం 900, చెరకు 80, సోయాబీన్ 54, కాగా ఇతర పంటలు 14,000 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేసి.. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉం చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా పంటల సాగుకు సంబంధించి వివిధ రకాల విత్తనాలు 20, 661 క్వింటాళ్లలో అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. పత్తి 450 గ్రాములు ప్యాకెట్లు 3,98,000 అవసరమవుతాయని భావిస్తున్నారు.
లైసెన్స్ డీలర్ల వద్ద కొనండి
వ్యవసాయ శాఖ అధికారులు పత్తి, ఇతర పంటల విత్తనాలను లైసెన్స్ డీలర్ల వద్ద రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. రైతులు పత్తి విత్తనాలను లైసెన్స్ డీలర్ల వద్దే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అనధికార వ్యక్తులు హెచ్టీ పాజిటివ్ పత్తి విత్తనాలను నేరుగా రైతులకు విక్రయించేందుకు యత్నిస్తున్నారని.. ఆ వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉం డాలని సూచిస్తున్నారు. హెచ్టీ పాజిటివ్ (హెచ్టీ) పత్తి విత్తనాలకు జీఈఏసీ అనుమతి లేదని పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ పత్తి విత్తనాల ప్యాకెట్ (450 గ్రాములు) ధర నిర్దేశించినది. బీజీ 1 రూ.635, బీజీ 2రూ.853 ఉంది. అదేవిధంగా జిల్లా వ్యవసాయ శాఖ సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో జీలు గ 235.8 క్వింటాళ్లు, జనుము 3604.6 క్వింటాళ్లు, మొత్తం 3840.4క్వింటాళ్లు.
35 కౌంటర్లలో..
వానకాలం సాగుకు సంబంధించి అధికారులు విత్తనాలను రైతులకు 35 కౌంటర్లలో సరఫరా చేయనున్నారు. రైతులు సబ్సిడీ విత్తనాలను తీసుకొనేందుకు పట్టాదార్ పాస్బుక్, ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవా లని సూచిస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు 1,02,504 టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. అందులో యూరియా 41,849 టన్నుల్లో, డీఏపీ 15,816, ఎస్సెస్పీ 4,177, ఎంవోపీ 5,013, కాంప్లెక్స్ 35,649 ఎరువులను సకాలం లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా పచ్చిరొట్ట, భాస్వరం, జీవన ఎరువులను ప్రోత్సహించాలని నిర్ణయించారు.
ఖరీఫ్లో 4,39,631 ఎకరాల్లో సాగు
రానున్న వానకాలంలో జిల్లాలో 4,39,631 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నట్లు అంచనా వేశాం. గతేడాదితో పోల్చితే వానకాలంలో 96,630 ఎకరాల్లో వివిధ రకాల పంటలు అదనంగా సాగు కానున్నాయి. సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేయాలి. రసీదులను కూడా వెంటనే తీసుకోవాలి. ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నట్లు సమాచారముంటే మాకు తెలిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ వానకాలంలో పత్తి, కంది పంటల సాగును పెంచాలని నిర్ణయించాం.
– గీతారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారిణి, రంగారెడ్డి జిల్లా