షాబాద్, ఏప్రిల్ 27 : గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మొత్తం 12,026 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 873 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 743 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. అవసరమున్నవారికి కంటి అద్దాలతో పాటు, ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
370 గ్రామాలు, 73 వార్డుల్లో
కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట : గురువారం వికారాబాద్ జిల్లాలో 5249 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 549 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 677 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 370 గ్రామాలు, 73 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
కండ్లు మసకగా కనిపించేవి
– సత్తమ్మ, ఊరెళ్ల గ్రామం, చేవెళ్ల మండలం
సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం. పేదలకు కంటి సమస్యల పరిష్కారానికి ఈ శిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. నాకు కండ్లు మసకగా కనిపించేవి. పరీక్షలు చేయించుకొని అద్దాలు, మందులు తీసుకున్నా.