షాద్నగర్ : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి దరఖాస్తును పరిశీలించి ఓటు హక్కును కల్పించాలని, అన్ని ప్రాంతాల్లో ఓటర్ జాబితాను సవరించి తుది జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్గోయల్ కలెక్టర్లకు సూచించారు. ఇందులో భాగంగానే బుధవారం ఓటర్ నమోదు కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం-6ద్వారా కొత్త ఓటు హక్కును నమోదు చేయడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు.
ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుంచి ఫారం-7ద్వారా తీసుకుని ఓటర్ జాబితా నుంచి వారి పేర్లను తొలగించాలన్నారు. అలాగే డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలన్నారు. శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదు ఉంటే ఫారం- 8ద్వారా సరిచేయాలని సూచించారు. ఓటర్లకు తమ పోలింగ్స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ రూపొందించిందని, దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని, గరుడ యాప్ వినియోగంపై బూత్స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ఈవీఎం గోదాములను ప్రతి నెల తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ జిల్లాలో 3307 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 19,059 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి బీఎల్ఓ గరుడ యాప్ ఉపయోగించడం జరుగుతుందన్నారు. జవవరి 5న తుది జాబితా ప్రకంటించడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్ఓ హరిప్రియ, పీడీడీ ఆర్డీ ప్రభాకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.