షాబాద్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిలకు మేనమామగా సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్పల్లి మున్సిపాలిటీలోని పీఆర్ ప్యాలెస్లో 201 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ…మూడేండ్ల కాలంలో ఒక్క బాలాపూర్ మండలంలోనే 3480 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందించామన్నారు. సీఎం కేసీఆర్ తరుఫున నూతన జంటలకు మంత్రి అభినందనలు తెలిపారు. పేదింటి ఆడబిడ్డలకు మేనమామగా పెండ్లికి ఆర్థిక సాయం అందజేయడం గొప్ప విషయమన్నారు.
కరోనా కాలంలోనూ పథకాల అమలు..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, బీమా, పింఛన్ లాంటి సంక్షేమ కార్యక్రమాలను కరోనా కాలంలో కూడా కొనసాగించామని మంత్రి సబితారెడ్డి అన్నారు. కేసీఆర్ కిట్తో ప్రైవేట్ దవాఖానల బాధలు తగ్గాయన్నారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ బిడ్డ పుడితే రూ. 12వేలు ఇస్తుండడంతో ప్రభుత్వ దవాఖానలలో ప్రసవాలు పెరిగిన్నట్లు తెలిపారు. తాగునీటి కోసం పైపులైన్లు తదితర వాటి కోసం నియోజకవర్గానికి రూ.210 కోట్లు నిధులు మంజూరైతే అందులో జల్పల్లి మున్సిపాలిటీకి రూ.30కోట్లు వచ్చాయన్నారు. మున్సిపాలిటీలో పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
60లక్షల సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ..
షాబాద్, నవంబర్ 7 : దేశంలో 60 లక్షల సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డిజిల్లాలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తలకు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించిన ఘనత సీఎం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రతిపక్షాల ప్రచారంపై నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో తిప్పి కొట్టాలన్నారు.