ఇబ్రహీంపట్నం : తెలంగాణ రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ మండలాలు, మున్సిపాలిటీల అధ్యక్ష, కార్యదర్శుళ్లు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం మొండివైఖరిని ఎండగడుతూ.. సోమవారం నిర్వహించే నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనేదిలేదని ప్రకటించిన విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
సోమవారం ఉదయం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాల్లో రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్కమిటి మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ సత్తయ్య, ఎంపీపీ కృపేష్, మున్సిపల్ చైర్పర్సన్లు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.