అగ్నిమాపక శాఖలో కైట్ ఐ టెక్నాలజీ
సమాచారం అందిన నిమిషానికే రెడీ
సరైన సమయంలో ప్రమాదాల నివారణ
వాహనాలకు అమర్చనున్న జీపీఎస్
సిబ్బంది సెల్ఫోన్లకూ ఏర్పాటు చేసే ఆలోచన
వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నాలుగు చోట్ల అగ్నిమాపక కేంద్రాలు
వికారాబాద్, మార్చి 29, (నమస్తే తెలంగాణ) : అగ్నిప్రమాదం జరిగిందంటే ఆలస్యం కాకుండా ప్రమాద స్థలానికి ఫైరింజన్ చేరుకునేలా అగ్నిమాపక శాఖ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. ఫైరింజన్లకు కైట్ ఐ సాంకేతిక పరిజ్ఞానంతో జీపీఎస్ అమర్చి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేయనున్నది. సమాచారం అందగానే త్వరగా ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదాన్ని నివారించనున్నది. ఉన్నత స్థాయి అధికారుల మొబైల్ ఫోన్లకూ టెక్నాలజీని జోడించనున్నారు. దీంతో సిబ్బంది బయలుదేరారా..లేదా ..? ఫైరింజన్ ఎక్కడున్నది.. ఎటు వైపు వెళ్తున్నది అన్న విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంతోపాటు నాలుగు చోట్ల అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఎండకాలంలో జరిగే అగ్నిప్రమాదాల నివారణకు టెక్నాలజీని వినియోగించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఫైరింజన్లకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అగ్నిమాపక శాఖ కొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. నష్ట నివారణ చర్యల్లో జాప్యం లేకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఫైరింజన్లకు కైట్ ఐ సాంకేతిక పరిజ్ఞానంతో జీపీఎస్ అమర్చనుంది. ఆటంకాలు ఉండకుండా ఉండేందుకు ఆ వాహనాలు వెళ్లే రోడ్డు మార్గాన్ని గ్రీన్ ఛానల్గా మార్చేందుకు ట్రాఫిక్ పోలీసులతో చర్చించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా గ్రేటర్ హైదరాబాద్ ఎంపిక చేశారు. మిగతా చోట్ల ప్రాంతాలను పరిశీలన చేస్తున్నారు.
నాలుగు చోట్ల అగ్నిమాపక కేంద్రాలు..
వికారాబాద్ జిల్లా కేంద్రంతో పాటుగా నాలుగు చోట్ల అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. అలాగే ఆయా ప్రాంతాల్లో బుల్లెట్ మోటార్ సైకిళ్లు ఏర్పాటు చేశారు. ఫైరింజన్లకు జీపీఎస్ అమర్చడం, కైట్ ఐ సాంకేతిక పరిజ్ఞానంతో వీక్షించేందుకు మొదట నగరంలో ప్రయోగం విజయవంతం కావడంతో జిల్లాలకు కూడా విస్తరింప జేయనున్నారు. జిల్లా పరిధిలో 4 ఫైర్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఫైరింజన్లకు జీపీఎస్ను అమర్చే అవకాశాలు ఉన్నాయి. అగ్నిప్రమాదం సమాచారం అందిన నిమిషంలోపే సిబ్బంది బయలుదేరారా ..లేదా ..? అని తెలుసుకోవడానికి వీలుంటుంది. ఒక వేళ సరైన సమయానికి చేరుకోలేకపోతే అందుకు గల కారణాలు చెప్పాల్సి ఉంటుంది. కాగా.. కైట్ ఐ టెక్నాలజీతో ఫైరింజన్ ఏ సమయంలో ఎక్కడుంది. ఎటు వైపు వెళ్తోందన్న విషయాలను కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని స్క్రీన్పై కనిపించేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల మొబైల్ ఫోన్లకు కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడంతో మ్యాప్ రూపంలో కన్పించేలా కసరత్తు చేస్తున్నారు. ఫైరింజన్లపై పర్యవేక్షణ ఉంటే ప్రమాదాలను సరైన సమయానికి నివారించవచ్చని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆర్.సుధాకర్ తెలిపారు. జీపీఎస్ ద్వారా లొకేషన్ను పసిగట్టవచ్చు. ప్రస్తుతానికి జిల్లాలోని అన్నిచోట్ల అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అగ్నిమాపక శాఖలో తీసుకువచ్చిన కొత్త టెక్నాలజీని జిల్లాలకు కూడా విస్తరించే ఆలోచన ఉన్నది.
మంటలతో జాగ్రత్త ..
వేసవి కాలంలో రోజు రోజుకూ ఉప్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల వికారాబాద్ జిల్లాలోని పలు చోట్ల విద్యుత్ ప్రమాదాలు, అడవి దగ్ధమైన ఘటనలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గంలో దాదాపుగా 200లకు పైగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల వాహనాలు సైతం అగ్నికి ఆహుతి అవుతున్నాయని, వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాల్లో ఉన్న అడవులకు మంటలంటుకున్నట్లు చెప్పారు.