జగిత్యాల : అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల సంక్షేమం భారంగా మారిందని జగిత్యాల జడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత సురేష్ ( Dava Vasantha ) ఆరోపించారు. ఆసరా పింఛన్ల పథకాన్ని రద్దుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి బీడీలు చుడుతూ నిరసన ( BRS Protest ) తెలిపారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడబిడ్డలంటే రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కి ఎందుకింత అక్కసు అని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి ఎగనామం పెడుతూ ఎగవేతల రేవంత్ రెడ్డిగా మారుతున్నారని విమర్శించారు. కల్యాణ లక్ష్మి పథకానికి కోర్టు స్టే ఇస్తే దానికి ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయకుండా జాప్యం చేయడం వెనుక మర్మం ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ మేనమామ లాగా ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం కింద 75 వేల నుంచి మొదలుకొని లక్ష 116 ఇచ్చారని అన్నారు. తులం బంగారం ఇస్తామనిని ఆశ చెప్పి కనీసం లక్ష రూపాయలు ఇచ్చే పరిస్థితిలో లేరని విమర్శించారు. రైతు బీమా దళిత బంధు లాంటి అనేక సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
వంద రోజుల్లో అమలు చేస్తానన్న హామీలు రెండున్నర సంవత్సరాలైనా కూడా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. ఆడబిడ్డ హక్కులను హరించవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్ రావు, దావా సురేష్, శీలం ప్రియాంకప్రవీణ్, మహిపాల్ రెడ్డి, గంగారెడ్డి, జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.