నందిగామ : డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నందిగామ సీఐ రామయ్య పిలుపునిచ్చారు. నందిగామ మండల ప్రజాప్రతినిధులు, యువకులతో సీఐ రామయ్య డ్రగ్స్, గంజాయి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ రామయ్య మాట్లాడుతూ యువత ఎక్కువగా డ్రగ్స్, గంజాయికీ బానిసలు అవుతున్నారని, ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. డ్రగ్స్, గంజాయి నియంత్రనపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. నందిగామ మండలంలో డ్రగ్స్ నియంత్రణకు 21 ప్రత్యేక డ్రగ్స్ స్క్యాడ్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
గ్రామాల్లో ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి అమ్ముతున్నట్లు, తాగుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ముఖ్యంగా యువకులు, ప్రజాప్రతినిధులు సహకారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఎస్ఐ ధనుంజయ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, సర్పంచ్లు రమేశ్గౌడ్, పాండురంగారెడ్డి, ఉపసర్పంచ్ కుమార్గౌడ్, నాయకులు దేపల్లి అశోక్గౌడ్, నర్సింహా, యువకులు పాల్గొన్నారు.