శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైలును ఏర్పాటు చేయాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యం. దానికోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ సంస్థను సైతం ఏర్పాటు చేశారు. మెట్రో రెండో దశలో భాగంగా ఐటీ కారిడార్లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి గచ్చిబౌలి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు సుమారు 31కి.మీ పొడవునా మెట్రో కారిడార్ను నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించడంతో పాటు ఢిల్లీ మెట్రో రైలు సంస్థతో డీపీఆర్ను సిద్ధం చేసి ఉంచారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు ఒకేసారి రూ.1000 కోట్లు కేటాయించడంతో ఇక మెట్రో అధికారులు రెండో దశ మెట్రోపై కసరత్తు మొదలు పెట్టారు.
భూ సేకరణ అవసరం లేదు
31కి.మీ మేర ఉండే శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో కారిడార్లో భూ సేకరణ అవసరం లేకపోవడంతో ఈ ప్రాజెక్టును ఎంతో వేగంగా పూర్తి చేయడమే కాకుండా సుమారు రూ.4వేల కోట్ల నిధులు వెచ్చిస్తే సరిపోతుందనే అభిప్రాయాన్ని మెట్రో అధికారులు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించగా, ప్రాజెక్టు ప్రారంభమైతే హెచ్ఎండీఏతో పాటు టీఎస్ఐఐసీ, జీఎంఆర్ ఎయిర్పోర్టు సంస్థలు సైతం కొంత మొత్తాన్ని ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీనికి తోడు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం ద్వారా రెండేండ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే ప్రణాళికలను మెట్రో అధికారులు సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో కారిడార్ పనులను క్షేత్ర స్థాయిలో ప్రారంభించేందుకు మెట్రో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిధులకు లోటు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ శంషాబాద్ ఎయిర్పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో చేపట్టాలని అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగా సీఎం కేసీఆర్ అనుకుంటున్న లక్ష్యం త్వరగానే నెరవేర్చే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.
కాలుష్యరహితంగా…
హైదరాబాద్ మహానగరంలో వాహన కాలుష్యంతీవ్రంగా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థలో ఇప్పటికీ ఆర్టీసీ బస్సులే కీలకంగా ఉన్నాయి. ఆ తర్వాతే మెట్రో రైలు, ఎంఎంటీఎస్ వంటివి ఉన్నాయి. కాగా నగర శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఆర్టీసీ బస్సులు 100కు పైగానే నడుస్తున్నాయి. అయితే మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు నడిచే అవకాశం లేదు. అదే సమయంలో ప్రైవేటు వాహనాలు, క్యాబ్లు వేల సంఖ్యలోనే నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో వాహనాలతో వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో రైలు కారిడార్ను నిర్మించి అందుబాటులోకి తీసుకురావడంతో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు తగ్గి కాలుష్యం తీవ్రత కొంత మేర తగ్గుతుంది. అదే సమయంలో మెట్రో రైలు అంటేనే పూర్తిగా కాలుష్య రహితం. అందుకే వీలైనంత త్వరగా విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ మెట్రో రైలు కారిడార్ను నిర్మిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నది.
సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా..
నగరానికి పడమర ఉన్న ఐటీ కారిడార్ శరవేగంగా విస్తరిస్తున్నట్లుగానే, దక్షిణాన శంషాబాద్ ఎయిర్పోర్టు చుట్టు పక్కల ప్రాంతాల్లో నగరం మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉంది. దీంతో ఆ ప్రాంతానికి మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థను కల్పించాలని సీఎం కేసీఆర్ కొన్నేండ్ల కిందటే నిర్ణయించారు. శంషాబాద్ కేంద్రంగా విమానయాన రంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన రకరకాల కార్యకలాపాలకు అవకాశం ఉండటంతో మొదటి ప్రాధాన్యత కింద శంషాబాద్ వరకు మెట్రో రైలు తీసుకువెళ్లాలని సీఎం కేసీఆర్ మెట్రో అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి గచ్చిబౌలి ఓఆర్ఆర్, అక్కడి ఔటర్ రింగు రోడ్డుకు లోపలి వైపు ఉన్న రైల్వే కారిడార్ కోసం సేకరించిన భూముల్లో మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు సర్వే నిర్వహించారు. తాజాగా పనులు ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసే పనిలో మెట్రో అధికారులు నిమగ్నమై ఉన్నారు.
ఇవీ కూడా చదవండి…
ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ చేస్తున్నారు