రంగారెడ్డి, జూలై 3 (నమస్తే తెలంగాణ) : జవహర్నగర్ డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో..
నగరవాసుల కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నది.. దుర్వాసన..కాలుష్యం..అనారోగ్యంతో అక్కడి ప్రజల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో..మాటల్లో చెప్పలేం. ఈ నేపథ్యంలో మరో జవహర్నగర్లా ఇంకో ప్రాంతాన్ని మార్చేందుకు సర్కార్ పావులు కదుపుతున్నది. సిటీ చెత్త కుంపటిని సిద్ధాపూర్, బండరావిరాల గ్రామస్తులు నెత్తిన రుద్దాలని చూస్తున్నది. జవహర్నగర్ అనుభవం దృష్ట్యా ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎకో పార్కు పేరుతో చెత్తను డంపింగ్ చేసి.. రీసైక్లింగ్ చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
జవహర్నగర్ లాంటి పరిస్థితులు మాకొద్దంటూ.. నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సిద్ధాపూర్ గ్రామంలోని సర్వేనంబర్ 252, 278, 361లో ఉన్న 86 ఎకరాల ప్రభుత్వ భూమిని చెత్త డంపింగ్ కోసం హెచ్ఎండీఏకు కేటాయిస్తూ టీజీఐఐసీ జీవో సైతం జారీ చేసింది. ఇందులోభాగంగా హెచ్ఎండీఏ ఆ భూమిని రాంకీ సంస్థకు కేటాయించింది. దీంతో సిద్ధాపూర్ పరిసరాల్లో ఉన్న పచ్చని పొలాలు, పల్లెలను కలుషితం చేయాలన్నా సర్కార్ నిర్ణయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు సిద్ధమవుతున్నారు.