జయశంకర్భూపాలపల్లి, జూన్ 3 (నమస్తే తెలంగాణ): విజన్లేని నాయకుడి చేతిలో తెలంగాణ రాష్ట్రం విలవిలలాడుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు అంతా అసత్య ప్రచారాలతో పబ్బం గడుపాలని చూస్తున్నారే తప్ప వాస్తవాలకు దగ్గరగా పరిపాలన చేయడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే గత ప్రభుత్వం అప్పులు చేసింది.. తాము ఆ అప్పులను కడుతున్నామని తొండిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అందులో భాగంగానే ఇటీవలే మంత్రి జూపల్లి కృష్ణారావు అవసరమైతే తెలంగాణ భవన్కు చర్చకు వస్తా, బీఆర్ఎస్ వాళ్లు చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరితే, ఆ సవాల్కు గురువారం తమ నాయకుడు కేటీఆర్ సిద్ధమని తెలుపగా, మంత్రి జూపల్లి మళ్లీ వేదిక మార్చడం సిగ్గుచేటని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి విజన్ ఏందో.. ఆయనకే తెలియడం లేదని ఎద్దేవాచేశారు. రూ.4 వేల పెన్షన్, రూ.15 వేల రైతుబంధు ఏమైందని ప్రశ్నించారు.
ఇప్పటికే దాదాపు 3 విడుతల్లో ఇవ్వాల్సిన రైతుబంధు ఎగ్గొట్టారని, మొత్తం భూమికి రైతుబంధు ఇస్తానని చెప్పి కేవలం 4 ఎకరాలకు మాత్రమే ఇవ్వడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో జిల్లా ప్రధాన వైద్యశాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని దుయ్యబట్టారు. పోస్టుమార్టం కోసం దవాఖానలోని మార్చురీకి తీసుకొచ్చిన మృతదేహాల మాంసాన్ని కుక్కలు ఎత్తుకుపోతున్నా పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు.