నిర్వహించగా, గురువారం కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆయాచోట్ల నేత్రపర్వంగా పూల జాతర సాగింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఆడపడుచులు గ్రామ ప్రధాన కూడళ్లు, వీధుల్లో ఉంచి గౌరమ్మకు పూజలు చేసి ఆడిపాడారు. శ్రీరామ చంద్రుడు ఉయ్యాలో.. అయోధ్య పట్నానా ఉయ్యాలో.. యుద్ధాన సాయం ఉయ్యాలో.. కపివీరులకును ఉయ్యాలో.., గౌరమ్మ నిను కొలుతు ఉయ్యాలో.. ఘనమైన పూజాలే ఉయ్యాలో.., ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ.. అంటూ చూపరులను ఆకట్టుకునేలా లయబద్దంగా పాటలు పాడుతూ చప్పట్లతో పాటు పలుచోట్ల కోలాటం ఆడారు. చిన్నాపెద్ద పటాకులు కాల్చి సంతోషంగా గడిపారు. అనంతరం సమీపాల్లోని కుంటలు, చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయే సందమామ.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ ఆడపడుచులు, యువతులు సద్దుల బతుకమ్మ సంబురాలను గురువారం వైభవంగా జరుపుకొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కట్టుబొట్టుతో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మను ఘనంగా పూజించారు. అన్నింటిని ఒక్క దగ్గరికి చేర్చి చిన్నా పెద్ద తేడాలేకుండా బతుకమ్మలతో ఆడిపాడారు. బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా తరలివెళ్లారు. అనంతరం బతుకమ్మలను చెరువు, కుంటలతో పాటు బతుకమ్మ ఘాట్ల వద్ద భక్తిశ్రద్ధలతో పూజించి, నిమజ్జనం చేశారు. రంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో అదనపు కలెక్టర్లు ప్రతీక్జైన్, తిరుపతిరావు పాల్గొన్నారు. మహిళలను గౌరవించి వారి ఔన్నత్యాన్ని చాటే పండుగ బతుకమ్మ అని అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. పూలను పూజించే సంస్కృతి, సంప్రదాయాలు ఒక్క తెలంగాణలోనే ఉన్నాయన్నారు.