మలక్పేట, ఏప్రిల్ 11: అంధుల జీవితాల్లో జ్ఞాన జ్యోతిని వెలిగిస్తున్నది మలక్పేట్లోని బ్రెయిలీ ముద్రణాలయం. చేతివేళ్ల స్పర్శతో ప్రపంచాన్ని అధ్యయనం చేయడంతో పాటు ఆరు చుక్కల అక్షర లిపీని పుస్తకాల రూపంలో అందిస్తూ.. చూపు లేని వారికి దిక్సూచిగా నిలుస్తున్నది. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో పుస్తకాలను ముద్రిస్తూ..తెలుగు రాష్ర్టాల్లోని అంధులకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ..సరస్వతీ పుత్రులుగా తీర్చిదిద్దుతున్నది. అత్యాధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న ఈ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే టెక్నీషియన్లు అంతా అంధులే కావడం గమనార్హం.
1986లో..
1986లో ప్రారంభమైన ఈ ముద్రణాలయంలో అప్పట్లో గంటకు 25-30 పేజీలు ముద్రించే మాన్యువల్ ప్రింటర్లు ఉండేవి. ఒకటి నుంచి పది తరగతుల వరకు తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో పాఠ్య పుస్తకాలు అందించేవారు. ఆ తర్వాత జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న ఐడిల్ బర్గ్ ప్రింటర్ ద్వారా గంటకు 200 పేజీలను ముద్రించే సామర్థ్యాన్ని పెంచుకున్న ముద్రణాలయం.. తర్వాత స్వీడెన్ టెక్నాలజీతో రూపొందించిన బేసిక్ డి నాలుగు ప్రింటర్లు, నాలుగు కంప్యూటర్లు, ఇండెక్స్ ఫోర్ ఇంటు ఫోర్ ప్రో ప్రింటర్లతో గంటకు 350 పేజీలను ప్రింటింగ్ చేసే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం రూ.70 లక్షల వ్యయంతో నార్వే టెక్నాలజీతో తయారై.. 1900 పేజీలను ముద్రించే బ్రాలో-650 అత్యాధునిక ప్రింటర్ను కొనుగోలు చేయడంతో ముద్రణాలయ సామర్థ్యం నాలుగు రేట్లు పెరిగింది.
ప్రింటింగ్ చేసే విధానం
ఎనిమిది మంది ఉద్యోగులతో నడుస్తున్న ఈ బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్లో రెండు రాష్ర్టాలోని అంధులకు కావాల్సిన అన్ని రకాల పుస్తకాలను ముద్రించడంతో పాటు ఆర్డర్లపై కూడా ప్రచురిస్తున్నారు. డేటా ఎంట్రీ, ఫ్రూఫ్ రీడింగ్, ప్రింటింగ్, బైండింగ్, డిస్పాచింగ్ ఇలా ఐదు విభాగాలు ఉండగా, అందులో పనిచేసే వారంతా అంధులే. ముద్రణాలయంలోని విశాలమైన బల్లపై ఉన్న యంత్రానికి అల్యూమినియం షీట్ను అమర్చి, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల బటన్ల సహాయంతో బ్రెయిలీ లిపికి ప్రాణం పోస్తారు. మార్బర్ స్టీరియో టైపర్ అనే యంత్రంపై ప్రూఫ్ రీడింగ్ చేస్తారు. అచ్చుల్లో వచ్చిన తప్పులను మరో యంత్రం సహాయంతో తొలగించి తిరిగి చుక్కలు వేస్తారు. ప్రూఫ్రీడింగ్ నుంచి ప్రింటింగ్ సెక్షన్కు వెళ్తే పుస్తకం తయారీకి కావాల్సిన పరిమాణాన్ని ఎంపిక చేసుకొని, కావాల్సినన్ని కాపీలు తీసుకొని ముద్రిస్తారు. వాటిని కావాల్సిన సైజుల్లో కటింగ్ మిషన్ సహాయంతో కట్చేసి బైండింగ్ చేస్తారు. ముద్రణాలయం ప్రారంభమైనప్పటి నుంచి ఎడిటర్గా, స్టీరియోటైపర్గా అంధుడు వెంకటేశ్వర్రావు, మేనేజర్, ఇన్చార్జిగా రమేశ్ పనిచేస్త్తున్నారు.
తెలంగాణ యాసలో..
30 ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రంలోని లక్షలాది మంది అంధులకు తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలు, స్ఫూర్తి త్రైమాసిక పత్రిక, క్యాలెండర్లను, జనరల్ పుస్తకాలు, వెంకటేశ్వర సుప్రభాతం, పోలీస్శాఖ, నల్సార్ యూనివర్సిటీ పుస్తకాలు, లూయీస్ బ్రెయిలీ, హెలెన్ కెల్లర్ జీవిత చరిత్రలను, పార్లమెంటరీ యాక్ట్ 1995, డిసేబుల్డ్ యాక్ట్ 2016, ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005ను, ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, ఐడీ, విజిటింగ్ కార్డులు వంటివి మూడు మాధ్యమాల్లో అందిస్తున్న బ్రెయిలీ ముద్రణాలయం రాష్ట్ర ఆవిర్భావనంతరం స్వరాష్ట్రంలో అంధులకు తెలంగాణ యాసలో కూడా పుస్తకాలను అందిస్తున్నది.
ఇవీ కూడా చదవండి…
అన్ని వర్గాల అభివృద్ధే సంకల్పం
కార్పొరేషన్లో టీఆర్ఎస్దే విజయం