మున్సిపాలిటీ అభివృద్ధికి కొత్తగా
రూ.50 కోట్లతో ప్రతిపాదనలు
ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మణుగూరు, ఏప్రిల్11: సకల జనుల సంక్షేమమే లక్ష్యమని, అన్ని వర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. మణుగూరు మున్సిపాలిటీలో ఆదివారం విస్తృతంగా పర్యటించిన ఆయన పలు రకాల అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మణుగూరు మున్సిపాలిటీలో ప్రధాన రహదారితోపాటు ముఖ్యమైన ప్రాంతాల్లో సుందరీకరణలో భాగంగా మినీ జంక్షన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మణుగూరు పట్టణంలో ప్రధాన రహదారిని రూ.కోటితో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కొత్తగా రూ.50 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. తొలుత మున్సిపాలిటీ అభివృద్ధి పనులు, సమీకృత మార్కెట్, మున్సిపల్ కార్యాలయ నిర్మాణం, వైకుంఠధామం, సుందరీకరణ పనుల గురించి మున్సిపల్ కమిషనర్ పి.నాగప్రసాద్, టౌన్ ప్లానింగ్ అధికారితో చర్చించారు. మన మణుగూరు అభివృద్ధి పనుల డిజైన్, బ్లూ ప్రింట్లను పరిశీలించారు. జడ్పీటీసీ పోశం నర్సింహారావు, మున్సిపల్ ఏఈ సత్య, పీఏసీఎస్ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరావు, టీఆర్ఎస్ నాయకులు ముత్యంబాబు, అడపా అప్పారావు, బొలిశెట్టి నవీన్కుమార్, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, శంకర్, కృష్ణ పాల్గొన్నారు.